Dharmendra Pradhan | యూనివర్శిటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)తో ఇంజినీరింగ్ కోర్సుల ఎంట్రన్స్ జీఈఈ, వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ను విలీనం చేసే ప్రణాళికే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. భవిష్యత్లో సీయూఈటీతో నీట్, జేఈఈలను విలీనం చేస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ జగదీశ్ కుమార్ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన సొంత రాష్ట్రం ఒడిశాలోని ఓ విద్యా సంస్థ విద్యార్థులతో ఇష్టాగోష్టి చర్చల్లో ఈ సంగతి చెప్పారు.
విద్యార్థులతో జరిగిన ఇష్టాగోష్టి చర్చల్లో సీయూఈటీలో నీట్, జేఈఈ విలీనం కోసం కేంద్రం సూత్రప్రాయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ధర్మేంద్ర ప్రధాన్ తేల్చి చెప్పారు. విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. సీయూఈటీలో నీట్, జేఈఈ విలీనం చేయడానికి కనీసం రెండేండ్లు పడుతుందన్నారు.
నూతన విద్యా విధానానికి అనుగుణంగా వచ్చే రెండేండ్లలో కొత్త పాఠ్య పుస్తకాలు వస్తాయని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరి నుంచి స్కూళ్లలో బాల్ వాటిక (కిండర్ గార్డెన్) అనే పేరుతో ఐదేండ్ల ఫౌండేషన్ కోర్సుకు పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. దేశంలోని విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ విద్యా కోర్సులను అభ్యసించడానికి వీలుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు.