Navneet Kaur | అమరావతి, ఏప్రిల్ 17: ‘దేశంలో మోదీ వేవ్ లేదు’ అంటూ సినీ నటి, మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ బీజేపీ అభ్యర్థి నవనీత్ రాణా చేసినట్టుగా పేర్కొంటున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమరావతిలో సోమవారం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ‘గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా పోరాటం సాగించాలి. మధ్యాహ్నం 12 గంటల కల్లా ఓటు వేయించడానికి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించాల్సి ఉంటుంది. మోదీ వేవ్(హవా) ఉందనే భ్రమల్లో ఉండకండి. 2019లో కూడా మోదీ వేవ్ ఉంది. అయినప్పటికీ నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాను’ అని ఆమె పేర్కొన్నారు.
కాగా, ఆమె చేసిన వ్యాఖ్యలను విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సమర్థించింది. ‘ఆమె నిజం చెప్పారు. ఓటర్ల వాస్తవిక అభిప్రాయాలను ఆమె ప్రతిబింబించారు’ అని పేర్కొంది. కాగా, రాణా 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఎన్సీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఆమె వ్యాఖ్యలు వీడియో వైరల్ కావడంతో దానిపై ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (యూబీటీ) మాట్లాడుతూ విజయంపై బీజేపీ వర్గాల్లో తీవ్ర భయాందోళన నెలకొందని పేర్కొన్నాయి. మహారాష్ట్రలోని 48 సీట్లను విపక్ష కూటమి గెల్చుకుంటుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ‘మోదీ వేవ్ మాట మరచిపోండి. మోదీ తాను పోటీ చేస్తున్న స్థానంలో విజయం సాధిస్తారా లేదా అన్నది కూడా అనుమానమే’ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీ కేవలం 45 సీట్లు మాత్రమే నెగ్గుతుందంటూ తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ పార్టీ సొంత అభ్యర్థులే ఇప్పుడు ఈ నిజాన్ని గట్టిగా, స్పష్టంగా చెప్పారు అని తెలిపారు.
తన వ్యాఖ్యలు వైరల్ కావడంపై నవనీత్ రాణా బుధవారం వివరణ ఇచ్చారు. తన ప్రసంగాన్ని ఎడిట్ చేసి తప్పుడు అర్థం వచ్చేలా చేశారని ఆమె ఆరోపించారు. ‘ప్రజలకు మోదీ చేసిన అభివృద్ధి గురించి తెలుసు. దేశంలో మోదీ వేవ్ ఉండేది… ఉంది.. ఉంటుంది’ అంటూ ఆమె గత, వర్తమాన, భవిష్యత్తు పరిస్థితులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము మోదీ చేసిన అభివృద్ధిని, చేసిన వాగ్దానాలను మాత్రమే చూపెట్టి ఓట్లు అడుగుతున్నామన్నారు.