అహ్మదాబాద్, మే 2: పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. కింది కోర్టు ఆదేశాల్ని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమని, కోర్టు వేసవి సెలవులు ముగిసిన తర్వాతే తుది తీర్పు వెలువరిస్తామని మంగళవారం పేర్కొన్నది. పిటిషన్పై రెండు వైపుల వాదోపవాదనలు ముగిసాయని, అత్యవసరంగా మధ్యంతర ఉత్తర్వు లేదా తుది తీర్పు ఇవ్వాలని రాహుల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనాన్ని కోరారు. దీన్ని జస్టిస్ హేమంత్ తోసిపుచ్చారు. కేసు రికార్డ్స్, కింది కోర్టు ఉత్తర్వులు పరిశీలించి..సెలవులు ముగిసిన తర్వాత తుది తీర్పు వెలువరిస్తానని చెప్పారు. మే 8 నుంచి జూన్ 3 వరకు కోర్టుకు వేసవి సెలవులు ఉండటంతో, అప్పటివరకూ కోర్టు తీర్పు కోసం రాహుల్గాంధీ ఎదురుచూడాల్సిన పరిస్థితి. ప్రధాని మోదీ ఇంటిపేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకుగాను దాఖలైన క్రిమినల్ పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్గాంధీకి రెండేండ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.