MEA | పాకిస్తాన్, అమెరికా తదితర దేశాలతో భారతదేశ సంబంధాలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. అణు పరీక్షలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. ఈ విషయం భారత్కు పూర్తిగా తెలుసునని.. రహస్య, చట్టవిరుద్ధమైన అణు కార్యకలాపాలు పాకిస్తాన్ చరిత్రలోనే ఓ భాగమని ఆయన విమర్శించారు. స్మగ్లింగ్, ఎగుమతి, ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలు తెలిశాయని.. ఎప్పటికప్పుడు పాక్ అణు కార్యక్రమాల గురించి అంతర్జాతీయ సమాజానికి చెబుతూనే ఉన్నామన్నారు. పాక్ అణుపరీక్షలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను గమనిస్తూనే ఉన్నామన్నారు. ట్రంప్ భారత పర్యటన గురించి చేసిన ప్రకటనపై ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ట్రంప్ భారత పర్యటనపై తాను ఏమీ స్పందించలేనని.. ఎందుకంటే చెప్పేందుకు తన వద్ద ఏమీ లేదన్నారు. భారత్లో ట్రంప్ పర్యటనపై మావద్ద సమాచారం ఏదీ లేదన్నారు.
వైట్హౌస్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు బాగా జరుగుతున్నాయని.. త్వరలోనే భారత్లో పర్యటించనున్నట్లుగా వ్యాఖ్యానించారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించిందని.. మోదీ తన స్నేహితుడని.. ఇద్దరం మాట్లాడుకుంటున్నామన్నారు. తనను భారత్లో పర్యటించాలని మోదీ ఆహ్వానించినట్లుగా తెలిపారు. త్వరలోనే తేదీని నిర్ణయిస్తామని.. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, తాను భారత్కు వెళ్తానని చెప్పుకొచ్చారు. ఇటీవల ట్రంప్ సీబీఎస్ న్యూస్ ఇంటర్వ్యూలో రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని.. అమెరికా మాత్రమే పరీక్షలను నిలిపివేసిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇతర దేశాలు అణు పరీక్షలు చేస్తున్న సమయంలో.. మనం కూడా అదే పని చేయాలన్నారు.
ఇండో-పసిఫిక్ క్వాడ్ కీలకమైందని ప్రభుత్వం తెలిపింది. జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, భారత్తో కూడిన వ్యూహాత్మక సంస్థ అయిన క్వాడ్ గురించి అడిగిన ప్రశ్నకు రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. క్వాడ్ భాగస్వామ్య దేశాలు ఇండో-పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన క్లిష్టమైన అంశాలపై చర్చించేందుకు ఒక ముఖ్యమైన వేదికగా భావిస్తున్నారన్నారు. క్వాడ్ నిరంతరం అభివృద్ధి చెందుతోందని.. అక్టోబర్ 29-30 తేదీల్లో ముంబయిలో జరిగిన క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ది ఫ్యూచర్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఇండియా మారిటైమ్ వీక్ ఒక ముఖ్యమైన కార్యక్రమన్నారు. ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన సమస్యలపై స్పందించారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారత్ను సందర్శించిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య అభివృద్ధి, సహకారం చర్చించామన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్, ఆఫ్ఘన్ కౌంటర్లో ఫోన్లో మాట్లాడారన్నారు. రాయబార కార్యాలయం, కార్యకలాపాలు, కాబూల్లోని మా సాంకేతిక మిషన్ను రాయబార కార్యాలయానికి అప్గ్రేడ్ చేయడం విషయానికొస్తే, పరిస్థితిని వివరంగా చర్చించాలన్నారు. విస్తరణకు సంబంధించిన అన్ని అంశాలు పరిశీలనలోనే ఉన్నాయని.. త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.