ముంబై: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మహారాష్ట్ర ప్రజలు దహీ అండీ సంబరాల్లో పాల్గొంటారు. దాన్ని మనం ఉట్టి కొట్టడం అంటాం. అయితే ఈ ఏడాది మహారాష్ట్రలో ఉట్టి కొట్టే వేడుకలను నిర్వహించడంలేదు. సంబరాలను ఈ ఏడాది నిర్వహించ వద్దు అంటూ సోమవారం ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఉత్సవ నిర్వాహకులను కోరారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ వేడుకలను రద్దు చేసుకోవాలని సీఎం కోరారు. అయితే స్వల్ప స్థాయిలో దహీ అండీ నిర్వహించుకుంటామని కొన్ని రోజుల క్రితం ఆ రాష్ట్రానికి చెందిన మండళ్లు, గోవింద బృందాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేను కూడా వాళ్లు కలిశారు. పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నవారితో చిన్నగా వేడుకలను నిర్వహించుకుంటామని దహీ అండీ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. స్వల్ప స్థాయిలో గణేశ్ ఉత్సవాలను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినప్పుడు, మరెందుకు దహీ అండీకి పర్మిషన్ ఇవ్వలేదని వాళ్లు ప్రభుత్వాన్ని అడిగారు.