న్యూఢిల్లీ, మార్చి 17: ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్, నీట్ యూజీ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందన్న ఊహాగానాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం కొట్టిపడేసింది. పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 1-15 మధ్య జరుగుతాయని గతంలో ప్రకటించగా, ఇటీవల మరో ప్రకటన చేస్తూ ఏప్రిల్ 4-15 మధ్య జరుగుతాయంటూ రివైజ్డ్ షెడ్యూల్ను ప్రకటించింది.
నీట్ యూజీ పరీక్షలు మే 5న జరగాల్సి ఉండగా, ముందుగా పేర్కొన్నట్టుగానే అప్లికేషన్ కరెక్షన్ విండో మార్చి 18 నుంచి మొదలవుతుంది. సీయూఈటీ యూజీ పరీక్షలు మే 15- 31 వరకు జరగాల్సి ఉండగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాక సీయూఈటీ షెడ్యూల్పై నిర్ణయం తీసుకుంటామని తొలుత చెప్పినప్పటికీ, ఈ షెడ్యూల్లోనూ ఎలాంటి మార్పు లేదని యూజీసీ చీఫ్ జగదీశ్కుమార్ తెలిపారు.