ఇంఫాల్: జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్నార్సీ) ప్రక్రియను పూర్తి చేయకుండానే జనాభా గణన చేపడతామన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై మణిపూర్లో నిరసనలు ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం దిగివచ్చింది. ఆ రాష్ట్రంలో జనాభా గణనను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. (No Census In Manipur) సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మణిపూర్లో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మణిపూర్ గవర్నర్, సీఎం యుమ్నం ఖేమ్చంద్ సింగ్, కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ) అమలుకు ముందే రాష్ట్రంలో జనాభా గణన ప్రక్రియను వాయిదా వేయాలని మణిపూర్లోని పలు వర్గాలు చేసిన అభ్యర్థనపై ఈ సమావేశంలో చర్చించారు. మణిపూర్ ప్రజల మనోభావాలు, ఆకాంక్ష మేరకు ప్రతిపాదిత జనాభా గణన ప్రక్రియను వాయిదా వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
కాగా, 2023 నుంచి మణిపూర్లో మైతీ-కుకీ జాతుల మధ్య ఘర్షణల కారణంగా 250 మందికిపైగా ప్రజలు మరణించారు. 50,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. చాలా మంది ప్రజలు పలు ప్రాంతాలకు వలసపోయారు.
ఈ నేపథ్యంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) ప్రక్రియను పూర్తి చేయకుండానే జనాభా గణన చేపడతామన్న కేంద్రం నిర్ణయాన్ని మైతీ-నాగా ప్రజలు వ్యతిరేకించారు. ఈ వర్గాల నిరసనలు ఉధృతం కావడంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. మణిపూర్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జనాభా గణన ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.