న్యూఢిల్లీ, ఆగస్టు 27: జేఈఈ, నీట్లలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా మార్కులు వస్తే ర్యాంకును నిర్ణయించడానికి ఇక వయసును ప్రాతిపదికగా తీసుకోరు. వయసులో ఎవరు పెద్దయితే వారికి ర్యాంకుల జాబితాలో ప్రాధాన్యం ఇచ్చే విధానానికి జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ) స్వస్తి పలికింది. జేఈఈ, నీట్ను వరుసగా జాతీయస్థాయిలో ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)-2020లో వయసు ప్రాతిపదికనే టాపర్ను నిర్ణయించారు. సోయెబ్ అఫ్తాబ్ (ఒడిసా), ఆకాంక్షా సింగ్ (యూపీ)లకు సమానంగా 720 మార్కులు వచ్చాయి. ఆకాంక్ష కంటే సోయెబ్ పెద్దవాడు అయినందున అతనే జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంకర్గా ప్రకటించారు. ఈ ఏడాది నుంచి ఆ విధానాన్ని అనుసరించరు.
జేఈఈలో…
మ్యాథ్స్కు ప్రాధాన్యమిస్తారు. తర్వాత కెమిస్ట్రీ, ఫిజిక్స్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ‘టై’ కొనసాగితే ఎవరి ‘నెగెటివ్’ సమాధానాలు తక్కువగా ఉన్నాయో పరిశీలిస్తారు. ఇదే విధానాన్ని జేఈఈ మెయిన్లో 2020లో అనుసరించారు.
నీట్లో…
బయాలజీ సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు/పర్సంటైల్ సాధించిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత కెమిస్ట్రీని పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ ‘టై’ కొనసాగితే అన్ని సబ్జెక్టుల్లో తప్పు సమాధానాలను ఎవరు తక్కువ రాశారో వారిని ఎంపిక చేస్తారు.