ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్
ముంబై: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకొంటే రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనను నిలబెట్టేందుకు అభ్యంతరాలు ఉండవని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. ఈ ఏడాది చివరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో నితీశ్ కుమార్ పోటీచేయాలని భావిస్తున్నారన్న వార్తలపై మాలిక్ మంగళవారం స్పందించారు. ఆయన అభ్యర్థిత్వంపై ఇప్పటికైతే ఎలాంటి చర్చ జరుగలేదని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ర్టాల్లో ఒక్కచోట కూడా బీజేపీ గెలిచే అవకాశం లేదన్నారు. యూపీలో బీజేపీకి 150 లోపే సీట్లు వస్తాయన్నారు. మతపరంగా దేశాన్ని విభజిస్తున్న బీజేపీని ప్రజలు తిరస్కరించబోతున్నారని తెలిపారు.