INDIA Alliance | న్యూఢిల్లీ, జనవరి 25: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి కకావికలమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ తీరుతో భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కటిగా కూటమిని వీడుతున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని తృణమూల్ కాంగ్రెస్, ఆ రాష్ట్ర సీఎం అధినేత మమతా బెనర్జీ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. పంజాబ్లో అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీచేస్తామని ఆప్ నేత, సీఎం భగవంత్ సింగ్ మాన్ ప్రకటించారు. తాజాగా జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా కూటమిని వీడటం దాదాపు ఖాయమైంది. ఆయన తిరిగి ఎన్డీయే కూటమిలో చేరనున్నట్టు తెలుస్తున్నది.
దీదీ ఒంటరిగానే..
బెంగాల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్ర మమతా బెనర్జీ బుధవారమే ప్రకటించారు. ఒక పక్క సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించగా, తనతో సీట్ల గురించి ఏ కాంగ్రెస్ నేత చర్చించలేదంటూ మమతా బెనర్జీ కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్ సొంతంగా 300 సీట్లలో పోటీ చేయనివ్వండి. బెంగాల్లో మాత్రం ఆ పార్టీతో పొత్తును ఎంతమాత్రం అంగీకరించమని ఆమె తేల్చిచెప్పారు. అలాగే రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర బెంగాల్ షెడ్యూల్ గురించి తనకెవరూ సమాచారమివ్వలేదని ఆమె మండిపడ్డారు. ఎన్నికల తర్వాతే పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు.
బీజేపీవైపు నితీశ్ చూపులు
కూటమిలోనే ప్రధాన నేతల్లో ఒకరైన బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇప్పుడు బీజేపీ వైపు చూపులు చూస్తుండటం కూటమికి పెద్ద దెబ్బేనని భావించవచ్చు. అదే జరిగితే బీహార్లో కాంగ్రెస్ పార్టీ, లాలూ ప్రసాద్కు చెందిన ఆర్జేడీలు మాత్రమే కూటమిలో నిలుస్తాయి. ఒక వేళ నితీశ్ కూటమిలో కొనసాగినా ఆర్జేడీ, జేడీయూలు చెరో 17 సీట్లు పంచుకుంటాయని భావిస్తున్నారు.
కేరళలో..
కాంగ్రెస్కు అధికార సీపీఎం హ్యాండిచ్చింది. అక్కడ సీపీఎంతో కాంగ్రెస్కు సీట్ల సర్దుబాటు అసాధ్యమని కాంగ్రెస్ నేత శశి థరూర్ వ్యాఖ్యానించారు.
అఖిలేశ్ గరం గరం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పట్టించుకోకపోవడంపై ఇప్పటికే పలుసార్లు ధ్వజమెత్తిన ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్తో ఎంతవరకు కలిసి వస్తారన్నది ప్రశ్న.
మహారాష్ట్రలోనూ అంతే
సార్వత్రిక ఎన్నికల్లో శివసేన (యూబీటీ) రాష్ట్రంలోని మొత్తం 48 సీట్లలో 23 చోట్ల పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ పునరుద్ఘాటించారు. అదే కనుక జరిగితే మహావికాస్ అఘాడి (ఎంవీఏ)లో ఉన్న ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ మిగిలిన 25 సీట్లను పంచుకోవాలి.
అధిర్ వల్లే పొత్తు చెడింది: ఓబ్రియన్
పశ్చిమబెంగాల్లో తాము ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించడానికి అసలు కారకుడు కాంగ్రెస్ లోక్సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి అని తృణమూల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఓబ్రియన్ చెప్పారు.