పాపన్నపేట, జూన్ 30: జల్సాలకు అలవాటు పడిన ఇరువురు యువకులు జూదంలో డబ్బులు గెలుచుకున్నాడన్న అక్కసుతో మరో యువకుడిని హత్య చేసి కటకటాల పాలయ్యా రు. మండలంలోని మిన్పూర్ శివారులో కోటగుట్ట వద్ద గత నెల 24వ తేదీన జరిగిన హత్య కేసును ఐడీ పార్టీ పోలీసులు ఛేదించి, ఇరువురు నిందితులను పట్టుకొని బుధవారం కోర్టుకు రిమాండ్ చేశారు. ఘటన వివరాలను పాపన్నపేట ఎస్సై సురేశ్ వెల్లడించారు. మిన్పూర్ శివారులో కోటగుట్ట సమీపంలో జూన్ 24వ తేదీన యువకుడు నాయికోటి శివకుమార్ (27) హత్యకు గురయ్యాడు. ఈ విషయమై పశువుల కాపరుల ద్వారా తెలుసుకున్న పాపన్నపేట ఎస్సై సురేశ్, మెదక్ రూరల్ సీఐ పాలవెల్లి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
డాగ్ క్లూస్ టీం సైతం రప్పించి హత్యకు సంబంధించిన వివరాలు సేకరించారు. మిన్పూర్ గ్రామానికి చెందిన నాయికోటి శివకుమార్ దౌలాపూర్ చెందిన చాకలి కృష్ణ, మచుకూరి మల్లేశం ముగ్గురు కలిసి జూన్ 23న జూదం ఆడగా, ఇరువురికి చెందిన రూ.28వేలు నాయికోటి శివకుమార్ గెలుచుకున్నాడు. డబ్బులు పొగొట్టుకున్న చాకలి కృష్ణ, మచుకూరి మల్లేశం ఎలాగైనా తమ డబ్బులు తాము తీసుకోవాలని పథకం పన్నారు. అం దులో భాగంగా జూన్ 24న శివకుమార్ ఫోన్ చేసి జూదం ఆడుదామని రమ్మన్నారు. జూదం ఆడడానికి కూర్చున్న శివకుమార్ కృష్ణ, మచుకూరి మల్లేశం ఇద్దరు కలిసి హత్యచేసి డబ్బులతో పారిపోయారు. మెదక్ రూరల్ సీఐ పాలవెల్లి, ఐడీ పార్టీ పోలీసులు నిందితులను మచుకూరి మల్లేశం ఇంటి వద్ద విచారించగా, హత్య తామే చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులను కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఎస్సై సురేశ్ వివరించారు.