Nirmala Sitharaman | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: యూపీఏ పదేండ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని, అవినీతి పెచ్చరిల్లిపోయిందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. దీర్ఘకాలిక ఆర్థిక పరిపుష్టికి యూపీఏ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదని, స్వల్పకాలిక ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకొన్నదని ఆరోపించింది. 2004 నుంచి 2014 వరకు సాగిన యూపీఏ పాలనపై మోదీ సర్కారు రూపొందించిన శ్వేతపత్రాన్ని గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. పత్రాన్ని చదివి వినిపించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్, ఎన్డీయే పదేండ్ల పాలనలో దేశం ఎంతో గొప్పగా ఆర్థిక ప్రగతి సాధించిందని చెప్పుకొచ్చారు. యూపీఏ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ కొరవడటంతో ద్రవ్యలోటు భారీగా పెరిగిపోయిందని విమర్శించారు. మౌలిక వసతుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని, సామాజికాభివృద్ధి పథకాలకు నిధులను సక్రమంగా ఇవ్వలేదని దుయ్యబట్టారు. యూపీఏ పదేండ్ల పాలనలో సగటు ద్రవ్యోల్బణం 8.2 శాతంగా ఉండేదని, దానిని తగ్గించేందుకు ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆరోపించారు. 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకు ఎంతో ఆరోగ్యంగా, 7 శాతం వృద్ధితో దూసుకుపోయిన ఆర్థిక వ్యవస్థను.. ఆ తర్వాత పదేండ్లలో తిరోగమనంలోకి తీసుకెళ్లారని విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్సింగ్ రాజ్యసభ పదవీకాలం గురువారమే ముగిసింది. అదేరోజు ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ మోదీ సర్కారు పార్లమెంటులో శ్వేతపత్రం ప్రవేశపెట్టడం గమనార్హం. మన్మోహన్సింగ్కు వీడ్కోలు పలుకుతూ ప్రధాని మోదీ పార్లమెంటులో మాట్లాడారు. మన్మోహన్సింగ్ ఆరోగ్యం సహకరించకపోయినా వీల్చైర్లో ఉంటూ కూడా కష్టపడి పనిచేశారని కీర్తించటం విశేషం.
యూపీఏ పదేండ్ల పాలనంతా తప్పుడు విధాన సాహసాలు, కుంభకోణాలే. 2014లో బొగ్గు కుంభకోణం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 2జీ కుంభకోణం వల్ల భారత టెలికం రంగం ఎంతో విలువైన ఒక దశాబ్ద కాలాన్ని కోల్పోయింది.
2008లో వచ్చిన ఆర్థిక మాంద్యాన్ని (2008 ఆర్థిక మాంద్యానికి భారత్ గురికాలేదు) చూసి కూడా యూపీఏ ప్రభుత్వం తన విధానాలపట్ల పశ్చాత్తాపపడలేదు. అప్పులు చేస్తూనే పోయింది.
యూపీఏ ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక, ద్రవ్య విధానాల వల్ల ఆ ప్రభుత్వ చివరి రోజుల నాటికి దేశ వృద్ధి సామర్థ్యం తీవ్రంగా పడిపోయింది. దీంతో ఆర్థిక వ్యవస్థ పెళుసుగా తయారైంది.
2004 కంటే ముందు ఉన్న ప్రభుత్వాలు చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల యూపీఏ ప్రభుత్వం లాభపడింది. కానీ, ఆ విధానాలను కొనసాగించటంలో విఫలమైంది.