కొచ్చి : కేరళలో 2010లో సంచలనం సృష్టించిన ప్రొఫెసర్ చెయ్యి నరికిన ఘటనలో ముగ్గురు దోషులకు జీవితఖైదు విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో ముగ్గురికి మూడేండ్ల జైలు శిక్షను విధించింది. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన కోర్టు, ఉపశమనం పొందేందుకు వారికి అర్హత లేదని పేర్కొంది. ప్రత్యేక కోర్టు జడ్జి అనిల్ కే భాస్కర్ కేసును విచారించారు. నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి చెందిన సాజిల్, నాసర్, నజీబ్లను ప్రధాన దోషులుగా పేర్కొంటూ జీవిత
ఖైదును విధించారు. దోషులకు సహకరించిన నౌషద్, పీపీ మొయిద్దీన్ కున్హు, అయూబ్లకు మూడే ండ్ల జైలు శిక్షను విధించింది. రూ.4 లక్షలను జరిమానాగా విధించిన కోర్టు, ఆ మొత్తాన్ని బాధితుడు జోసెఫ్కు అందించాలని సూచించింది.
ప్రొఫెసర్ టీజే జోసెఫ్ చేతిని 2010లో పీఎఫ్ఐకి చెందిన సభ్యులు దారుణంగా నరికేశారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రశ్నాపత్రం తయారీలో ప్రొఫెసర్ ఓ మతాన్ని కించపరిచారనే ఆరోపణలపై వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.