న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో చెలరేగిన ఎన్నికల అనంతర హింసపై దర్యాప్తునకు ఏర్పాటైన జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తుది నివేదికను కోల్కతా హైకోర్టుకు సమర్పించింది. నివేదికను స్వీకరించిన కోర్టు ఈనెల 22న కేసు విచారణ చేపడతామని పేర్కొంది. ఇక 50 పేజీల ఎన్హెచ్ఆర్సీ నివేదిక ఎన్నికల అనంతర హింసపై దీదీ సర్కార్ను తప్పుపట్టినట్టు తెలిసింది. బెంగాల్లో చట్ట పాలనకు బదులుగా పాలకులు అనుకుందే చట్టంగా చెలామణి అవుతోందని నివేదికలో ఎన్హెచ్ఆర్సీ ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.
మరోవైపు బెంగాల్లో ఎన్నికల అనంతర హింసపై రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని ఎన్నికల అనంతరం ఘర్షణలు చెలరేగాయని ఆధారాలున్నాయని జులై 2న హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక బెంగాల్లో ఎన్నికల అనంతర హింసపై చర్యలు చేపట్టని పక్షంలో ఈ వ్యాధి ఇతర రాష్ట్రాలకూ పాకే ప్రమాదం ఉందని ఎన్హెచ్ఆర్సీ నివేదిక స్పష్టం చేసినట్టు తెలిసింది. ఎన్నికల అనంతర అల్లర్లలో పలువురు ప్రాణాలు కోల్పోగా ఎందరిపైనో లైంగిక దాడులు జరిగాయని, పెద్దసంఖ్యలో ప్రజలు నిర్వాసితులు కాగా పలువరు అణిచివేతకు గురయ్యారని నివేదిక పేర్కొంది.