PM Modi | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేండ్లపాలనలో ధరల మోతతో సామాన్యుడి బతుకు దిన దినగండం నూరేండ్ల ఆయుష్షుగా మారింది. మోదీ సర్కారు అసమర్థ విధానాలు, అనాలోచిత నిర్ణయాలతో పేద, మధ్యతరగతి వారిపై ఏదో రూపంలో నిత్యావసర వస్తువుల ధరల బండ పడుతూనే ఉన్నది. ఇప్పటికే వంట గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ పెంపుతో ప్రజలు అల్లాడుతుంటే.. పెరిగిన నిత్యావసరాల ధరలు వారిపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. అందుకే ఎన్నికల ఫలితాలపై ధరల ప్రభావం కచ్చితంగా ఉంటుందని నూటికి 57 శాతం మంది చెబుతున్నారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): బియ్యం, వంటనూనె, పప్పులు, గోధుమపిండి, చక్కెర, పాలు, ఆలుగడ్డ, చింతపండు ఇలా అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేంద్రం చమురు రేట్లను పెంచితే, దాని దెబ్బ వ్యవసాయ పెట్టుబడి, రవాణా వ్యవస్థపై పడింది. తద్వారా ఆ ప్రభావంతో సరుకుల ధరలు నింగినంటాయి. మరోవైపు మోదీ ప్రభుత్వం ముందుచూపులేని విధానాలతో అంతర్జాతీయంగా రూపాయి అథఃపాతాళానికి చేరుకొన్నది. దీని ప్రభావం దిగుమతులపై పడి అంతిమంగా అది నిత్యావసరాల ధరలు ఆకాశానికి చేరేలా చేసింది. ప్రతీరోజూ కూరల్లో ఉపయోగించే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చితో పాటు క్యాప్సికం, బీన్స్ వంటి కూరగాయలు, వంటింటి మసాలాల ధరలు అందుకోలేని విధంగా పెరిగిపోయాయి. మొత్తంగా గడిచిన ఆరేడు నెలల్లోనే వివిధ కూరగాయలు, నిత్యావసరాల ధరలు 10 నుంచి 200 శాతం వరకు పెరిగినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
2014లో మోదీ ప్రధానిగా అధికారం చేపట్టిన నాటి నుంచి నిత్యావసరాల ధరలు సుమారు 300 శాతం పెరిగినట్టు లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా చార్జీలు 31 శాతం వరకు పెరిగినట్టు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ, ఆ లాభాన్ని వినియోగదారుడికి అందకుండా బీజేపీ సర్కారు ఖజానాకు మళ్లించింది. గడిచిన పదేండ్ల మోదీ సర్కారు డీజిల్పై 343 శాతం, పెట్రోల్పై 109 శాతం ఎక్సైజ్ పన్నులను పెంచినట్టు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) నివేదిక వెల్లడించింది. ఇదిలాఉండగా అంతర్జాతీయంగా రూపాయి చారిత్రక స్థాయికి పతనమవ్వడం పరిస్థితిని మరింతగా దిగజార్చింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటం, పెట్రోల్పై కేంద్రం సుంకాలను తగ్గించకపోవడంతో రానున్న రోజుల్లో నిత్యావసరాల ధరలు మరింతగా పెరిగే ప్రమాదమున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ధరలకు కళ్లెం వేయడంలో ప్రధాని మోదీ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు 57 శాతం మంది అభిప్రాయపడ్డారు. ధరాఘాతాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ ఎన్నికల్లో ఓటేస్తామని 23 శాతం మంది ఓటర్లు చెప్పారు. ఈ మేరకు సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్), లోక్నీతి సంయుక్తంగా జరిపిన సర్వేలో తేటతెల్లమైంది. అంతర్జాతీయ పరిణామాలను అటుంచితే, ధరల కట్టడికి అవకాశం ఉన్నప్పటికీ విధానపరంగా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సర్వేలో పాల్గొన్న మెజారిటీ ఓటర్లు అభిప్రాయపడ్డారు. గడిచిన 43 ఏండ్లలో ఎన్నడూ చూడని స్థాయిలో ధరలు పెరిగినట్టు వాపోయారు. ఈ వివరాలను ఇంగ్లిష్ పత్రిక ‘మింట్’ ప్రచురించింది.