Nitin Gadkari | రోడ్లపై ప్రమాదాల బారీన పడిన వారికి ఉచితంగా వైద్యం అందించేందుకు భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రణాళిక రూపొందిస్తున్నది. ముందు స్వర్ణ చతుర్భుజి రహదారుల్లో నగదు రహిత వైద్యం అందించి.. అటుపై అన్ని జాతీయ రహదారులకు విస్తరించాలని యోచిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. గురువారం లోక్సభ ప్రశ్నోత్తరాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సభ్యుల ప్రశ్నకు రాతపూర్వక సమాధానంలో పై సంగతి చెప్పారు.
ఢిల్లీ-ముంబై, ముంబై-చెన్నై, కోల్కతా-చెన్నై, ఆగ్రా-కోల్కతా, ఢిల్లీ- ఆగ్రా కారిడార్లోని జాతీయ రహదారులపై క్యాష్ లెస్ ట్రీట్మెంట్ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తున్నట్లు నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ రహదారులపై గాయపడిన డ్రైవర్లు, ప్రయాణికులు, పాదచారులకు ఈ స్కీం కింద ఉచిత వైద్యం అందిస్తారు. ప్రమాద స్థలానికి అంబులెన్స్ చేరినప్పటి నుంచి 48 గంటల వరకు ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. ఎన్హెచ్ఏఐ బాధితులకు రూ.30వేల వరకు ఖర్చును భరిస్తుంది. ఇందుకోసం బీమా సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించామని గడ్కరీ చెప్పారు.
ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ జయప్రదమైతే అన్ని జాతీయ రహదారులకు ఈ పథకం విస్తరిస్తామని నితిన్ గడ్కరీ చెప్పారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద 710 అంబులెన్స్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వచ్చే రెండేండ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు, పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల ధరలతో సమానం అవుతాయన్నారు.