Sharad Pawar | ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం మేరకే ఎన్నికల కమిషనర్ల ఎంపిక జరిగినట్లు తెలుస్తున్నదని ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ ఆరోపించారు. మాజీ ఐఏఎస్ అధికారులు సుఖ్ బీర్ సింగ్ సంధూ, గ్యానేశ్వర్ కుమార్ లను కొత్త ఎన్నికల సంఘం కమిషనర్లుగా ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలోని కమిటీ గురువారం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో ప్రధాని, కేంద్ర మంత్రి, లోక్ సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేత సభ్యులుగా ఉంటారు.
ఇంతకుముందు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక కమిటీలో ఇద్దరు కేంద్ర మంత్రులతోపాటు సుప్రీంకోర్టు జస్టిస్ ఒకరు ఉండేవారని శరద్ పవార్ గుర్తు చేశారు. ఇటీవలే ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక ప్రక్రియలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగిస్తూ మార్పులు చేశారు. `దీని ప్రకారం ఇద్దరు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక హక్కు కలిగి ఉంటుంది. దీనిపై ప్రధాని మోదీ నిర్ణయిస్తారు. వారి ఆశీస్సులకు అనుగుణంగానే నియామకాలు జరుగుతాయి’ అని పుణెలో శరద్ పవార్ ఆరోపించారు.