Sengol | న్యూఢిల్లీ, మే 26: నూతన పార్లమెంటులో స్పీకర్ కుర్చీ పక్కన ప్రతిష్ఠించనున్న సెంగోల్ (రాజదండం)పై కాంగ్రెస్, బీజేపీ మధ్య రగడ మొదలైంది. బ్రిటిషర్ల నుంచి భారత్కు జరిగిన అధికార బదిలీకి ఈ రాజదండం చిహ్నమని ఎక్కడా ఆధారం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ శుక్రవారం ట్వీట్ చేశారు. బీజేపీ చేస్తున్న ఈ ప్రచారం బోగస్ మాత్రమేనని కొట్టిపారేశారు.
అధికార బదిలీకి రాజదండం చిహ్నమని మౌంట్బాటన్, రాజాజీ, నెహ్రూ ఎక్కడా చెప్పలేదని జైరాం రమేశ్ గుర్తు చేశారు. తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ప్రచారం చేస్తున్నారని అన్నారు. పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎందుకు అనుమతించడం లేదనేదే అసలు ప్రశ్న అని ఆయన పేర్కొన్నారు. కాగా, జైరాం రమేశ్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పార్టీకి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే ఎందుకంత ద్వేషమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రశ్నించారు.