న్యూఢిల్లీ : కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో మరో తేజస్ ఎక్స్ప్రెస్ రద్దయింది. ఢిల్లీ-లక్నో తేజస్ ఎక్స్ప్రెస్ రైలు కార్యకలాపాలు శుక్రవారం నుంచి నిలిపివేస్తున్నట్లు భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తెలిపింది. ఈ నెల 9 నుంచి 20వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, రైలును తిరిగి నడపడానికి చర్యలు తీసుకుంటారని ఇండియన్ రైల్వే ఈ-టికెటింగ్ పేర్కొంది.
ఇంతకు ముందు మహారాష్ట్రలో కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ నెల 2 నుంచి అహ్మదాబాద్-ముంబై తేజస్ ఎక్స్ప్రెస్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. కరోనా మహమ్మారితో సరైన ఆక్యుపెన్సీ లేకపోవడంతో రద్దు చేసినట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ-లక్నో తేజస్ ఎక్స్ప్రెస్ కార్యకలాపాలు నిలిపివేతతో ఐఆర్సీటీసీ షేర్లు ఒత్తిడికి లోనవుతాయని నిపుణులు భావిస్తున్నారు. బుధవారం ఐఆర్సీటీసీ షేర్లు 1.30 శాతం పెరిగి రూ.1,709.55 వద్ద ముగిసింది.