న్యూఢిల్లీ: తాను బతికి ఉండగానే కాదు.. తన మృతదేహం కూడా బీజేపీలో చేరదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. తాము నిజమైన కాంగ్రెస్ వాళ్ళమని అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ బీజేపీలో చేరాలని అనుకోలేదన్నారు. ఒకవేళ, కాంగ్రెస్ నాయకత్వం తనను పార్టీ వీడాలని కోరితే అప్పుడు దాని గురించి ఆలోచిస్తానని, అయితే బీజేపీలో మాత్రం చేరబోనని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద్ బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో కపిల్ సిబల్ ఈ మేరకు గురువారం స్పందించారు.
కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న సమస్యలు ఏమిటో తనకు ఖచ్చితంగా తెలుసునని సిబల్ అన్నారు. తమ సమస్యలను పార్టీ నాయకత్వం వింటుందని తాను నమ్ముతున్నానని చెప్పారు. చెప్పేది వినకుండానే ఎవరూ మనుగడ సాగించలేరని, కార్పొరేట్ నిర్మాణం కూడా దీనికి మినహాయింపు కాదన్నారు. మాట వినకపోతే ఎవరైనా చెడ్డ రోజులలో పడతారని ఆయన వ్యాఖ్యానించారు.
జితిన్ ప్రసాద్ చేసిన దానికి తాను వ్యతిరేకం కాదని కపిల్ సిబల్ అన్నారు. అయితే బహిర్గతం చేయని కొన్ని కారణాలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఆయన బీజేపీలో ఎందుకు చేరుతున్నారో అన్నది తనకు అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. అయితే ‘ఆయా రామ్ గయా రామ్.. రాజకీయాలకు నిదర్శనమన్నారు.