హైదరాబాద్ : ఈ నెల 12వ తేదీన దేశ వ్యాప్తంగా నీట్ ( National Eligibility cum Entrance Test ) ఎగ్జామ్ను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది ఈ ఎగ్జామ్కు దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ, ఏపీ నుంచి లక్ష మంది ఉన్నారు. దేశ వ్యాప్తంగా 202 పట్టణాల్లో 3,842 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, తెలంగాణలోని 7 పట్టణాల్లో 112 కేంద్రాల్లో, ఏపీలో 9 పట్టణాల్లో 151 కేంద్రాల్లో పరీక్షకు ఏర్పాట్లు చేశారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. పెన్ను, పేపర్ విధానంలోనే పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రంలోని అడ్మిట్ కార్డు, ఫోటో, గుర్తింపు కార్డుతో పాటు చిన్న శానిటైజర్ బాటిల్కు మాత్రమే అనుమతిస్తారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించాలి. షూ, ఫుల్ హ్యాండ్ షర్ట్స్, పెన్నులు, ఆభరణాలు, వాటర్ బాటిల్స్కు అనుమతి లేదని ఎన్టీఏ అధికారులు స్పష్టం చేశారు.