అహ్మదాబాద్ : బిపర్ జాయ్ తుపాన్ (Cyclone Biparjoy) గుజరాత్ తీరాన్ని వణికిస్తోంది. తుపాన్ తీవ్రత అధికంగా ఉంటుందని ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నిఖిల్ ముధోల్కర్ విజ్ఞప్తి చేశారు. బిపర్ జాయ్ తుపాన్ ప్రభావంతో ప్రస్తుతం తీర ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని చెప్పారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో పరిస్ధితి సమీక్షిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో సైనిక బలగాలను మోహరించామని తెలిపారు.
మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జాయ్ తుపాను (Cyclone Biparjoy) తీరం వైపు దూసుకొస్తోంది. సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య పాకిస్థాన్ తీరం సమీపంలోని కచ్లో ఉన్న జఖౌ పోర్టు (Jakhau port) వద్ద అది కేంద్రీకృతమవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం గుజరాత్ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో బిపర్జాయ్ తుపాను పయణిస్తున్నదని తెలిపింది.
దీంతో గుజరాత్ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. తుపాను ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాను భారీ విధ్వంసం సృష్టించనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 70 గ్రామాలకు చెందిన 75 వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. త్రివిధ దళాలు సహా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.
Read More :
Philippines Earthquake | ఫిలిప్పీన్స్ ను వణికించిన భారీ భూకంపం