BJP | ఇంఫాల్, ఆగస్టు 6: హింసాత్మక ఘటనలతో గత మూడు నెలలుగా అట్టుడుకుతున్న మణిపూర్లో పరిస్థితులను చక్కదిద్దడంలో, శాంతిని పునరుద్ధరించడంలో అధికార బీజేపీ వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిరసనగా రాష్ట్రంలో ఆ పార్టీకి మిత్రపక్షం కుకీ పీపుల్స్ అలయెన్స్(కేపీఏ) గట్టి షాక్ ఇచ్చింది. ఎన్ బీరేన్సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొంటున్నట్టు ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ తీసుకొన్న నిర్ణయంపై కేపీఏ అధ్యక్షుడు తోంగ్మాంగ్ హాకిప్ గవర్నర్ అనుసూయ ఉయికేకు లేఖ రాశారు. బీజేపీ ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకొనేందుకు నిర్ణయించుకొన్నామని, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొంటున్నామని అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బీజేపీతో ఇక కొనసాగలేమని తెలిపారు. మణిపూర్ అసెంబ్లీలో కుకీ పీపుల్స్ అలయెన్స్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇంఫాల్ వెళ్లేందుకు కుకీ ఎమ్మెల్యేల్లో భయం
మణిపూర్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21న మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల కోసం ఇంఫాల్ వెళ్లేందుకు కుకీ ఎమ్మెల్యేలు జంకుతున్నారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య అసెంబ్లీ నిర్వహించటాన్ని కుకీ, నాగా ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనటం సాధ్యం కాదని చురాచాంద్పుర్ ఎమ్మెల్యే ఎల్ఎం ఖౌతే పేర్కొన్నారు. ‘ఇంఫాల్కు వెళ్లటం కుకీ ఎమ్మెల్యేలకు సురక్షితం కాదు’ అని కుకీ పీపుల్స్ అలయన్స్ ఎమ్మెల్యే హాకిప్ అన్నారు.
అసెంబ్లీకి వెళ్లొద్దంటూ హెచ్చరికలు
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని కుకీ ఎమ్మెల్యేలను కుకీ విద్యార్థి, మహిళా సంఘాలు హెచ్చరించాయి. నాగా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లొద్దంటూ నాగా గిరిజన సంఘాల్లో శక్తివంతమైన నాగా హోహో ప్రకటించింది. కుకీల ప్రత్యేక పాలనా కేంద్రాల ఏర్పాటు డిమాండ్ను మైతీల ఆర్గనైజేషన్ ‘కోకోమి’ వ్యతిరేకిస్తున్నది.