ముంబై: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్కు బీజేపీ కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఆరోపించారు. క్యాబినెట్ ర్యాంకుతో కూడిన నీతి ఆయోగ్ చైర్మన్ పదవిని ఇచ్చేందుకు ప్రయత్నించిందని ఆయన తెలిపారు. ఇటీవల ఎన్డీఏలో చేరిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, శరద్ పవార్ను తరచూ కలుస్తున్నారని పేర్కొన్నారు.
మరోవైపు మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే స్థానంలో అజిత్ పవార్ నియమితులవుతారని ఆ రాష్ట్ర విపక్ష నేత వడెట్టివార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అజిత్ సీఎం సీటు అధిరోహించే విషయం గురించి ఇటీవల అజిత్-శరద్ పవార్ మధ్య రహస్య మంతనాలు జరిగాయని తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల షిండే దవాఖానలో చేరతారని జోస్యం చెప్పారు.