న్యూఢిల్లీ: దేశం పేరు మార్పుపై ఇప్పటికే కేంద్రం స్పష్టమైన సంకేతాలిచ్చిన నేపథ్యంలో ‘ఇండియా’ పేరును పూర్తిగా తుడిచిపెట్టేసే పని ఊపందుకొన్నది. కొత్త తరానికి దేశ చరిత్ర, సంస్కృతులను పరిచయం చేసే పాఠశాల పాఠ్య పుస్తకాల నుంచి ఇండియా పేరును తీసేసి ‘భారత్’ అని చేర్చాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎన్సీఈఆర్టీ) కమిటీ సిఫారసు చేసింది.
పాఠశాల స్థాయిలో అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల్లోనూ ‘ఇండియా’ను ‘భారత్’గా మార్చటంతోపాటు ‘ప్రాచీన చరిత్ర’ స్థానంలో ‘క్లాసికల్ హిస్టరీ’ని ప్రవేశపెట్టాలని, ప్రత్యేకంగా ‘ఇండియన్ నాలెడ్జ్ సిస్టం’ (ఐకేఎస్)ను తీసుకురావాలని సిఫారసు చేసినట్టు కమిటీ చైర్పర్సన్ సీఐ ఐసాక్ తెలిపారు. అయితే, కమిటీ సిఫారసుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ చైర్మన్ దినేష్ సక్లానీ వెల్లడించారు. భారత్ అనే పేరు 7 వేల ఏండ్ల పురాతనమైన విష్ణు పురాణంలో ఉపయోగించారని, అందుకే దేశాన్ని ఆ పేరుతో సంబోధించాలని సూచించినట్టు ఐసాక్ తెలిపారు.
ప్రతిపక్షాల ఆగ్రహం
ఎన్సీఈఆర్టీ సిఫారసుపై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘ఇండియాను భారత్గా మార్చుతున్నట్టయితే రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీన్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ను ఎందుకు కొనసాగిస్తున్నాం. ఎన్సీఈఆర్టీ ప్రతిపాదన పూర్తిగా ప్రజావ్యతిరేకం. ఎన్డీఏ సర్కారు వారిపై ఒత్తిడి తెచ్చింది’ అని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. విపక్ష కూటమికి ఇండియా అని పేరుపెట్టినప్పటి నుంచి అధికార బీజేపీలో భయం మొదలైందని ఆర్ఎల్డీ ఎద్దేవా చేసింది.