Amit Shah : దేశంలో వచ్చే మార్చి 31లోపు నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మావోయిస్టుల ఏరివేత అంశంపై ఛత్తీస్ఘడ్ రాజధాని రాయ్పూర్లో ఆదివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమవేశంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 31లోపు నక్సలిజాన్ని పూర్తిగా తుడిచివేస్తామన్నారు. వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ప్రాంతంలో మావోయిస్టుల నిధులను అడ్డుకోవడం, లొంగుబాటు చర్యలు, భద్రతా దళాల ఆపరేషన్స్, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు మావోయిస్టుల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించాయన్నారు. ఛత్తీస్ఘడ్ ప్రభుత్వ అధికారులు, భద్రతా దళాలతో ఈ సమావేశం జరిగిందని అమిత్ షా వెల్లడించారు. కొన్నేళ్లుగా నక్సల్స్ కార్యకలాపాలు బలహీనంగా మారాయన్నారు. ఈ సమావేశానికి చత్తీస్ఘడ్ సీఎం విష్ణు దేవ్ సాయి, డీసీఎం విజయ్ శర్మ, కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఛత్తీస్ఘడ్లోని బస్తర్ ప్రాంతంలో మావోలు ఎక్కువగా ఉంటారు. ఈ ప్రాంతం మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, ఒడిశాలతో సరిహద్దు పంచుకుంటుంది.
ఇటీవల ఛత్తీస్ఘడ్ పోలీసులు వెల్లడించిన డాటా ప్రకారం.. ఈ ప్రాంతంలో 2024 నుంచి 500 మందికిపైగా నక్సలైట్లు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మావో అగ్రనేత నంబాల కేశవరావు కూడా ఉన్నారు. ఈ రెండేళ్ల కాలంలో 1,900 మందికిపైగా నక్సలైట్లు అరెస్టయ్యారు. 2,500 మందికిపైగా లొంగిపోయారు.