చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాటియాలా కోర్టులో లొంగిపోనున్నారు. 1998 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో మాజీ క్రికెటర్ సిద్ధూకు ఏడాది జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో లొంగిపోనున్నట్లు తెలిపిన సిద్ధు.. ఇందుకు కొన్ని వారాల సమయం కావాలని ఇవాళ సుప్రీంకోర్టులో ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. లాయర్ అభిషేక్ మనూ సింఘ్వీ ఈ పిటిషన్ వేశారు. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ధర్మాసనం ముందు ఆయన ఈ వివరణ ఇచ్చారు. వైద్య సంబంధిత ఏర్పాట్లను చేసుకోవాలని సిద్ధూ తరఫున లాయర్ కోర్టును కోరారు.
అయితే, ఈ కేసులో తీర్పును స్పెషల్ బెంచ్ ఇచ్చిందని, దానికి సంబంధించిన అప్లికేషన్ చీఫ్ జస్టిస్ ముందు ప్రవేశపెట్టాలని, ఒకవేళ సీజేఐ ఆ బెంచ్ను ఇవాళే ఏర్పాటు చేస్తే దాన్ని అంగీకరిస్తామని ఖాన్విల్కర్ బెంచ్ తెలిపింది. ఈ అంశాన్ని సీజే ముందు లేవనత్తున్నట్లు సిద్ధూ తరఫు లాయర్ సింఘ్వీ తెలిపారు. ఇదిలా ఉండగా.. సిద్ధూ పాటియాలాలోని నివాసంలో మద్దతుదారుల సమావేశం జరిగింది. మాజీ ఎంపీ డాక్టర్ ధరంవీర్ గాంధీ సైతం సిద్ధూను కలిశారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సైతం సిద్ధూకు ఫోన్ చేశారు. కాంగ్రెస్ మీ వెంటే ఉందని, బలంగా ఉండాలని సూచించారు.