ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తనను 70 సార్లు కలిశారని వెల్లడించారు. ఈ 70 సార్లూ… కాంగ్రెస్లో చేరమనే చెబుతూ వచ్చారని, ఇదే విషయంపై 70 సార్లు కలిశారన్నారు. ఓ జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్యూలో సిద్దూ పై విధంగా స్పందించారు. కాంగ్రెస్లోకి నన్ను ఆహ్వానించే విషయమై వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నన్ను 70 సార్లు కలిశారు. 30,35 సీట్లకు మించి కాంగ్రెస్ గెలవలేదు. మీరు చేరితే మరో 8 శాతం సీట్లు పెరుగుతాయి అని పీకే అభిప్రాయపడ్డారని సిద్దూ వెల్లడించారు. తన చేరిక వల్లే కాంగ్రెస్ లాభపడే సూచనలున్నాయని కూడా పీకే అభిప్రాయపడ్డారన్నారు.
తాను కాంగ్రెస్లో పదవుల కోసం ఎంత మాత్రమూ చేరలేదని సిద్దూ పునరుద్ఘాటించారు. అయితే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందన్న ధీమాతోనే వున్నారా? అని ప్రశ్నించగా.. రాజకీయాల్లో కరాఖండిగా చెప్పడమంటూ ఏదీ వుండదని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఛరిష్మాగానీ, పేరు గానీ శాశ్వతంగా ఉండవన్నారు. తనకు ఏ పదవీ అవసరం లేదని, మహాత్మా గాంధీ, వినోబాబావే… మిగితా వారికి ఎలాంటి పదవులున్నాయి? వారందరూ దేశసేవ చేయలేదా? అని సిద్దూ ప్రశ్నించారు.