హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ఒక అరుదైన సందర్భం.. ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంలో మరో రాజకీయ పార్టీ నేతలు పాల్గొనడం.. పార్టీ కార్యాచరణను స్వాగతించడం నిజంగా అరుదైన సన్నివేశం. బుధవారం తెలంగాణ భవన్లో ఇలాంటి దృశ్యం ఆవిష్కారమైంది. తెలంగాణ రాష్ట్రసమితి రెండు దశాబ్దాల ప్రస్థానం అనంతరం.. జాతీయ పార్టీగా రూపాంతరీకరించుకొన్న అద్భుత సందర్భానికి పలు రాష్ర్టాల రాజకీయ నాయకులు సాక్షీభూతంగా నిలిచారు. తమిళనాడు, కర్ణాటక, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి ప్రముఖ రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకావడం కేసీఆర్ కాంక్షిస్తున్న ఉజ్వల భారతావిష్కరణకు నాందీవాచకంగా కనిపించింది.
ప్రగతిభవన్లో అల్పాహారం
అతిథులుగా వచ్చిన ఆయా పార్టీల నేతలకు బుధవారం ఉదయం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అల్పాహార విందు ఇచ్చారు. కర్ణాటక నుంచి జనతాదళ్ (ఎస్) ముఖ్యనేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన శాసనమండలి పక్ష నేత బోజేగౌడ, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రధా న కార్యదర్శి బాలకిషన్రావు, విదుతాళై చిరుత్తాగళ్ కట్చె (వీసీకే) అధినేత, దళితనేత, ఎంపీ, తిరుమావళవన్ నేతృత్వంలో వీకేసీ కార్యదర్శి బాలసింగం, వీకేసీ ఏపీ అధ్యక్షుడు ఎన్జే విద్యాసాగర్, ఏపీ లీగల్వింగ్ ప్రెసిడెం ట్ నర్సింహమూర్తిల బృందం ప్రగతిభవన్కు చేరుకొన్నది. అతిథులను సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం అల్పాహారవిందు ఇచ్చారు. ఈ విందులో మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కర్ణాటక ఎమ్మెల్యే దేవానంద్ ఫులాసింగ్ చౌహాన్కు స్వాగతం పలుకుతున్న నాయకులు
తరలివచ్చిన దేశం
బీఆర్ఎస్కు మద్దతుగా ద్రావిడ దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వీ కృష్ణారావుతోపాటు దేశం నలుమూలల నుంచి రాజకీయ పార్టీల నేతలు, రైతు సంఘాల నేతలు తరలివచ్చారు. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మహారాష్ర్ట, తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి రైతు ఐక్య సంఘటన్ నేతలు తరలివచ్చారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. జేడీఎస్ నేత కుమారస్వామితోపాటు, కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ, ఎమ్మెల్యే సురేశ్గౌడ, కుమారస్వామి కుమారుడు, జేడీఎస్ నేత, ప్రముఖ కన్నడ సినీ హీరో నిఖిల్ గౌడతోపాటు జేడీఎస్ ఎమ్మెల్యేలు పుట్టరాజు, సరా మహేశ్, రేవణ్ణ, డీసీ తమ్మన్న, వీర భద్రయ్య, హెచ్కే కుమా రస్వామి, సురేశ్గౌడ్, మంజునాథ్ దరసహళ్లి, ఏ మంజునాథ్, డాక్టర్ అన్నదాని, బోజే గౌడ, బండెప్ప కాశంపూర్, రాజా వెంకటప్ప నా యక్, దేవనాథ్ చౌహాన్, నాగనగౌడ కనకూర్ సహా18 మంది ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అలాగే జాతీయ రైతు నేతలు గుర్నాం సింగ్, అక్షయ్కుమార్ (ఒడిశా); మాణిక్ కదమ్ (మహారాష్ర్ట), దశరథ్ సావంత్ (మహారాష్ర్ట), ఆకాశ్యాదవ్ (హర్యానా), కున్వర్సింగ్ (హర్యానా)తో పాటు ఉత్తరప్రదేశ్కు చెందిన నాయకులు పాల్గొన్నారు. దేశగతిని మార్చేందుకు ఎవ్వరూ మాట్లాడేందుకు ముందుకు రాని సందర్భంలో ధైర్యంగా ముందడుగు వేస్తున్న కేసీఆర్కు నైతిక మద్దతు ఇవ్వటంకోసం తామొచ్చామని జేడీ (ఎస్) ఎమ్మెల్యే సురేశ్ గౌడ, ద్రావిడదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు వంటెల కృష్ణారావు పేర్కొన్నారు.
అఖిలేశ్.. తేజస్వీ యాదవ్ శుభాకాంక్షలు
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆకాంక్షించారు. అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్ ఇరువురూ సీఎం కేసీఆర్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
దేశం విజనరీ కేసీఆర్ను కోరుతున్నది
కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరం. దేశంలో మానవీయ పాలనకు చిరునామాగా తెలంగాణను నిలబెట్టారు. కేసీఆర్ అంటే మొదటి నుంచి కర్ణాటకకు చాలా అభిమానం. తాత (దేవెగౌడ) గారు తెలంగాణ సందర్భం వచ్చిన ప్రతీసారి కేసీఆర్ చేసిన పోరాటం గురించి చెప్తారు. కేసీఆర్లో అద్భుత నాయకత్వ లక్షణం, విశేషమైన పాలనా అనుభవం ఉండటం వల్ల వారు దేశాన్ని తనదైన దృష్టికోణంలో చూస్తున్నారు. అందరినీ కలుపుకొని అద్భుతంగా ముందుకు వెళ్లగలిగే సత్తా కేసీఆర్కు ఉన్నది. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
– నిఖిల్ గౌడ, జేడీఎస్ నేత, ప్రముఖ కన్నడ సినీ నటుడు
ప్రజలకు ఏం కావాలో కేసీఆర్కు తెలుసు
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఇన్నాళ్లూ విని ఆశ్చర్యపోయా. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత తెలంగాణ అద్భుతంగా ఉన్నది. అభివృద్ధి, సంక్షేమంతో కూడిన ఇలాంటి మాడల్ ఇప్పుడు దేశానికి అవసరం. కేసీఆర్ ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు. ప్రజలకు ఏం కావాలో ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. ప్రస్తుతం దేశంలో రాజకీయ శూన్యత ఉన్నది. దానిని భర్తీచేసే సత్తా కేసీఆర్కు ఉన్నది.
– రేవణ్ణ, జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి
పరిపక్వ నేత కేసీఆర్
దేశంలో ప్రస్తుతం కేసీఆర్ లాంటి పరిపక్వ నేత ఎవరూ లేరు. నా రాజకీయ అనుభవంలో తన ప్రాంతం మీద అవగాహన సరిగాలేని నాయకులను ఎంతోమందిని చూశాను, చూస్తున్నాను. కానీ కేసీఆర్ తన రాష్ట్రం మాత్రమే కాదు యావత్ దేశ భౌగోళిక, ఆర్థిక, సామాజిక రంగాలపై, వనరుల లభ్యత, వాటి వినియోగంపై అవగాహన ఉన్న నాయకుడు. కేసీఆర్కు మా సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు వచ్చాం.
– బోజేగౌడ, కర్ణాటక శాసనమండలి జేడీఎస్ నేత
అణగారిన వర్గాలకు భరోసా
అణగారిన వర్గాలకు దళితబంధు పథకాన్ని అమలు చేస్తూ కేసీఆర్ వారిలో భరోసా ఇచ్చారు. దేశంలో ప్రజాస్వామ్య శక్తుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉన్నది. దీనికి కేసీఆర్ నాయకత్వం వహిస్తే బాగుంటందని మాలాంటి వాళ్ల అభిప్రాయం. దేశంలో దళితులు, అణగారిన వర్గాలపై వివక్ష కొనసాగుతున్నది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు పూర్తి అయినా ఆ వర్గాలకు న్యాయం జరగలేదు. కానీ తెలంగాణలో దళితబంధు పథకం విజయవంతంగా అమలు చేస్తున్నారు. దేశమంతా ఇటువంటి పథకాన్ని అమలు చేయాలి. తెలంగాణ ప్రగతిశీల సమాజం. రైతుబంధు ప్రవేశపెట్టినప్పుడు దళితులు వ్యతిరేకించలేదు. మిగతా వర్గాలు తమకేదని నిట్టూర్చలేదు. ఈ స్ఫూర్తి దేశమంతా విస్తరించాలి. ఆ స్ఫూర్తిని రగిల్చే వ్యక్తి కేసీఆర్ కాగలడని ఆశిస్తున్నాం.
– తిరుమావళన్, విదుతాళై చిరుత్తాగళ్ కట్చె (వీసీకే) అధినేత, తమిళనాడు ఎంపీ
ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతారు
జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొని పోరాడే నేత కోసం దేశం ఎదురుచూస్తున్నది. కేసీఆర్ కచ్చితంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని మొదటి నుంచీ గమనిస్తున్నా. ఇలాంటి అభివృద్ధే ఇప్పుడు దేశమంతటా కావాలి. అది కేసీఆర్తో సాధ్యమేనని నమ్ముతున్నాను.
– బాలకిషన్రావు, జేడీఎస్ ప్రధాన కార్యదర్శి