(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సంక్షోభం తీవ్రమైంది. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కోసం వీధుల్లోకి వచ్చిన వందలాది మంది ప్రజలు.. మండుటెండలో గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. అయితే, పెట్రోల్, డీజిల్కు కొరత లేదని, 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయంటూ ఎప్పటిలాగే కేంద్రం ప్రకటనలను గుప్పించింది.
కానీ, దేశంలో 9.5 రోజులకు సరిపడా మాత్రమే చమురు నిల్వలు ఉన్నాయని ఆర్టీఐ పిటిషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఏఐ చాట్బాట్స్ గ్రోక్, చాట్జీపీటీలను పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. ఈ విషయంపై సమగ్రంగా విశ్లేషించిన ఆయా ఏఐ ప్లాట్ఫామ్స్.. చమురు సంక్షోభం విషయంలో కేంద్రం విఫలమయ్యిందని, సమస్యను పరిష్కరించకుండా ప్రకటనలకే పరిమితమవుతున్నదని తేల్చి చెప్పాయి.
భారత్లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు వదంతులు నమ్మి పెద్దమొత్తంలో చమురును నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. ఒక వైపు హొర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభనతో చమురు సరఫరా నిలిచిపోయినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా 40 మంది సరఫరాదారుల నుంచి భారత్కు చమురు వస్తూనే ఉందని తెలిపింది.
చమురు సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా దేశ వ్యాప్తంగా ఉన్న శుద్ధి కర్మాగారాలు నూరు శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. భారత్ మొత్తం చమురు నిల్వ సామర్థ్యం 74 రోజుల దేశీయ అవసరాలకు సరిపోతుందని, అయితే ప్రస్తుతం 60 రోజులకు సరిపడా నిల్వలున్నాయని చెప్పారు.