హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): నర్మదా డ్యామ్ నీరు వదలడంతో సంభవించిన వరదల్లో నష్టపోయిన వారికి గుజరాత్ ప్రభుత్వం పలు అవసరాల కోసమంటూ కంటితుడుపుగా రూ.7 వేలు అందిస్తామని ప్రకటించడంపై ప్రజలు మండిపడుతున్నారు. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన మెప్పు కోసం గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ నర్మదా నదీ జలాలకు ఆర్భాటంగా పూజలు చేపట్టారు. అందుకోసం అధికారులు సర్దార్ సరోవర్ ప్రాజెక్టు వద్ద ఒకేసారి 18 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు.
దీంతో పరివాహక ప్రాంత జిల్లాలైన బరూచ్, నర్మదా, వడోదర, పంచమహల్, దాహూద్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో వరదలు సంభవించాయి. రైతులు పంటలు నష్టపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడితే బట్టలు, నిత్యావసరాలు కోసమంటూ కేవలం రూ.7 వేలు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించి, బీజేపీ ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తిస్తున్నదని బాధిత ప్రజలు మండిపడుతున్నారు. భరూచ్, నర్మదా, వడోదర జిల్లాల్లోనే నాలుగు లక్షల మంది రైతులు పంట నష్టపోయారని గుజరాత్ కాంగ్రెస్ నేత మనీష్ పేర్కొన్నారు.