న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోని అన్ని మసీదులు ముస్లిం సోదరులతో కిటకిటలాడుతున్నాయి. రంజాన్ పర్వదినం నేపథ్యంలో ఢిల్లీలోని జామా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దాదాపు రెండేండ్ల తర్వాత మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. కరోనా కారణంగా గత రెండేండ్ల నుంచి రంజాన్ పర్వదినం నాడు.. ఇండ్లకే పరిమితమై ప్రార్థనలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ముస్లింలు మాట్లాడుతూ.. రెండేండ్ల తర్వాత జామా మసీదుకు వచ్చి సామూహిక ప్రార్థనల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులతో సహా వచ్చి నమాజ్ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. దేశంలో శాంతి నెలకొనాలని ప్రార్థించామన్నారు. రాజకీయ నాయకులు మతం పేరుతో దేశాన్ని చీల్చకూడదని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
రంజాన్ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జామా మసీదు పరిసరాల్లో పోలీసులు నిఘా పెంచారు. అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రంజాన్ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, శాంతి భద్రతలు పాటించాలని ఢిల్లీ పోలీసులు కోరారు.
#WATCH | Devotees offer namaz at Delhi’s Jama Masjid on the occasion of #EidUlFitr pic.twitter.com/OuUt0imWKZ
— ANI (@ANI) May 3, 2022