Loksabha Elections 2024 : ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా అనుచిత వ్యాఖ్యలు కలకలం రేపాయి. దక్షిణాది వారు ఆఫ్రికన్లలా, తూర్పు ప్రాంతప్రజలు చైనీయులుగా కనిపిస్తారని ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కాషాయ పార్టీకి ప్రచారాస్త్రంలా మారాయి. సామ్ పిట్రోడా వ్యాఖ్యలను తేలికగా తీసుకోలేమని, రాహుల్ గాంధీకి ఆయన గురువుతో పాటు సలహాదారు కూడా అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు.
సామ్ పిట్రోడా ఆలోచనలు, ప్రకటనలు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాలేనని స్పష్టం చేశారు. సామ్ పిట్రోడా తరహాలోనే రాహుల్ గాంధీ కూడా విదేశీ మనస్తత్వం కలిగినవారని, వారి ఆలోచనలు, ఉద్దేశాలు భారత సంస్కృతికి దూరంగా ఉంటాయని అన్నారు. సామ్ పిట్రోడా చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు ప్రమాదకరం, భారతీయతను దెబ్బతీసేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రకటన అందరూ ఖండించదగినదని అన్నారు.
మన వేషభాషలు, ఆహారం, సంస్కృతి, ఆచార వ్యవహారాల్లో భిన్నత్వం ఉన్నా మన రూపురేఖల ఆధారంగా మనల్ని ఇతర దేశాలతో పోల్చడం సరైంది కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను మనం క్షమాపణ కోరలేమని, వారి వ్యవహార శైలే ఇలా ఉంటుందని చెప్పారు. సామ్ పిట్రోడా వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్ధించుకోలేదని అన్నారు. సామ్ పిట్రోడా ప్రకటన రాహుల్ గాంధీ ప్రకటనేనని కిరణ్ రిజిజు తేల్చిచెప్పారు.
Read More :
AstraZeneca: మార్కెట్ల నుంచి కోవిడ్ టీకాను వెనక్కి రప్పిస్తున్న ఆస్ట్రాజెనికా