Kishan Reddy | సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రమాదవశాత్తూ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గాడిద గుడ్డు పెట్టదు కానీ రేవంత్ రెడ్డి పెట్టించారని విమర్శించారు. ప్రతి పబ్లిక్ మీటింగ్లో గాడిద గుడ్డుతో వస్తుంటే.. రేవంత్ రెడ్డి పార్టీ గాడిద గుడ్డు పార్టీయా? ఆయన గుర్తు గాడిద గుడ్డా? అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని సెటైర్ వేశారు.
బీజేపీ రిజర్వేషన్లను తీసేస్తుందని జరుగుతున్న ప్రచారంపై కూడా కిషన్రెడ్డి స్పందించారు. రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరని స్పష్టం చేశారు. రిజర్వేషన్లను తొలగించబోమని ప్రధాని మోదీ కూడా చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని ధ్వజమెత్తారు.