Kashmiri Pandit | శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ కుటుంబానికి ఇరుగుపొరుగు ముస్లింలు అండగా నిలిచారు. తీవ్రవాదులకు భయపడకుండా సంజయ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన పాడె మోసి కుటుంబసభ్యుల బాధ పంచుకున్నారు. వారే కట్టెలు పోగేసి చితిని పేర్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సంజయ్ భార్యాపిల్లలను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఉగ్రవాదుల దుశ్చర్యకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో సైతం స్థానిక ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కశ్మీరీ యువతను ఉపయోగించుకొని అమాయక ప్రజలను హత్య చేయడాన్ని ముస్లింలు ఖండించారు.
సంజయ్ శర్మను హత్య చేసిన వారిలో ఓ ఉగ్రవాదిని భద్రత బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం పుల్వామా జిల్లాలోని అవంతిపోరా ప్రాంతంలో ఎదురు కాల్పుల్లో భాగంగా ఉగ్రవాదిని హతమార్చారు.