Mumbai Teacher : చేతిరాత (Hand writing) సరిగా లేదనే కారణంతో ఓ టీచర్ (Teacher) ఎనిమిదేళ్ల బాలుడిపట్ల క్రూరంగా ప్రవర్తించింది. క్యాండిల్ వెలిగించి దానిపై బాలుడి కుడి అరిచేయి పెట్టించింది. బాలుడు ఇంట్లో ఆ విషయం చెప్పడంతో.. అతడి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లోని మలాద్ ఏరియా (Malad) లో ఈ దారుణ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. ఈస్ట్ మలాద్లోని జేపీ డెక్స్ బిల్డింగులో రాజశ్రీ రాథోడ్ అనే యువడి ట్యూషన్స్ చెబుతుంటుంది. అదే ఏరియాలకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు మహమ్మద్ హమ్జా ఖాన్ స్థానిక లక్షధామ్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. రోజూ సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు రాజశ్రీరాథోడ్ ఇంటికి ట్యూషన్కు వెళ్తాడు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి కూడా హమ్జా ఖాన్ను అతడి సోదరి ట్యూషన్కు పంపి వెళ్లింది.
అయితే చేతిరాత సరిగా లేదని రాజశ్రీ ఆ బాలుడిపట్ల క్రూరంగా ప్రవర్తించింది. క్యాండిల్ వెలిగించి దానిపై బాలుడి కుడిచేయి పెట్టించింది. మంటలకు తాళలేక బాలుడు గుక్కతిప్పుకోకుండా ఏడవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రాత్రి 9 గంటల సమయంలో హమ్జా ఖాన్ బాగా ఏడుస్తున్నాడని, వెంటనే వచ్చి ఇంటికి తీసుకెళ్లాలని టీచర్ రాజశ్రీ రాథోడ్ బాలుడి తండ్రి ముస్తకీన్ ఖాన్కు ఫోన్ చేసింది.
దాంతో ముస్తకీన్ వచ్చి బాలుడిని ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఇంటికి తీసుకెళ్లిన తర్వాత బాలుడు విషయం చెప్పడంతో అతడి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.