Mumbai | ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబై నగరానికి మరోసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముంబై నగరంలో ఆరు చోట్ల బాంబులు పెట్టామని ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి బెదిరించాడు.
దీంతో ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఫోన్ చేసిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసు హెల్ప్లైన్కు చెందిన వాట్సాప్ నంబర్కు ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ముంబైకి గతంలోనూ పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. న్యూ ఇయర్ వేడుకల వేళ ఓ వ్యక్తి ముంబై పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి, పలు ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు బెదిరించాడు. అంతకుముందు కూడా ఆర్బీఐ ఆఫీసులు సహా పలు బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. అవన్నీ నకిలీవేనని పోలీసుల విచారణలో తేలింది.