Bullet Train | గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబై సిటీ మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ ట్రైన్ తొలి దశ ట్రయల్స్ 2026లో ప్రారంభిస్తారు. గుజరాత్లోని బిలిమొర-సూరత్ మధ్య ఈ ట్రయల్స్ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అటుపై ఇతర సెక్షన్లలో ట్రయల్స్ కొనసాగుతాయన్నారు. ట్రయల్ రన్ దశలో బుల్లెట్ రైలు గంటకు 350 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుందన్నారు. ఇది విమానం టేకాఫ్ అయ్యే వేగంతో సమానం అని అధికారులు వివరించారు. ప్రజలకు అందుబాటులోకి వచ్చాక గరిష్ఠంగా 320 కి.మీ వేగంతో నడుపుతామన్నారు.
బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే రవాణ వ్యవస్థలో కీలక మార్పులు జరుగుతాయని అధికారులు అంటున్నారు. విమానంతో సమానంగా బుల్లెట్ రైలు ప్రయాణం పోటీ పడుతుందన్నారు. విమాన ప్రయాణంలో అందుబాటులో లేని కనెక్టివిటీ ఫెసిలిటీ బుల్లెట్ రైలులో లభిస్తుందన్నారు. విమాన ప్రయాణంతో పోలిస్తే చెక్ ఇన్ టైం తక్కువుండటంతో కూర్చునేందుకు సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు.
ప్రత్యేకంగా రూపొందించిన స్లాబ్ ట్రాక్ సిస్టమ్పై ఈ బుల్లెట్ రైళ్లు నడుపుతారు. ఈ ట్రాక్లు గరిష్ఠంగా 350 కి.మీ. వేగాన్ని తట్టుకోగల సామర్థ్యం కలిగి ఉంటాయన్నారు. విమాన ప్రయాణంలో ఎకానమీ క్లాస్ టికెట్ ధరతో సమానంగా బుల్లెట్ రైలు టికెట్ ధర ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి.
ఈ ప్రాజెక్టు కోసం గుజరాత్లో నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ 99 శాతం భూమిని సేకరించింది. గుజరాత్తోపాటు దాద్రానగర్ హవేలీలో 352 కి.మీ. పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ బుల్లెట్ రైలు కారిడార్ మొత్తం పొడవు 508.17 కిమీ. ఈ ప్రాజెక్టు పూర్తయితే అహ్మదాబాద్-ముంబై మధ్య ప్రయాణానికి మూడు గంటలే పడుతుంది.