న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా కింద 10 సీట్లను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఎంపీలు లెటర్ జారీ చేసిన వారికి స్కూళ్లలో 10 మంది విద్యార్థులకు సీట్లు కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ కోటాను ఎత్తివేయాలని కొందరు, లేదు ఆ కోటాను పెంచాలని కొందరు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ అంశాన్ని రాజకీయ పార్టీలతో కలిసి చర్చించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. లోక్సభలో ఇవాళ ఈ అంశం గురించి చర్చించారు. దీనిపై రాజకీయ పార్టీలతో చర్చ నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ను స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు. కోటాలో ఎందుకు వివక్ష ఉండాలని స్పీకర్ అన్నారు. కేంద్ర స్కూళ్లలో 10 సీట్ల కోటా సరిపోదు అని, దాన్ని పెంచండి లేదంటే రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ డిమాండ్ చేశారు. అయితే ఎంపీల కోటాను రద్దు చేసే యోచనలో సభ ఉందని మంత్రి ప్రధాన్ అన్నారు. మనం ప్రజలకు ప్రతినిధులమని, కొందరి కోసం కాదన్నారు. మంత్రి నిర్ణయాన్ని కొందరు ఎంపీలు వ్యతిరేకించారు.