న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఏడాదిపాటు రైతుల అలుపెరుగని పోరాటం, వందలమంది బలిదానం, ఢిల్లీ నగరం దిగ్బంధనం.. మోదీ ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద సాగుచట్టాల పర్యవసానమిది. ఎన్ని కష్టాలెదురైనా, కేంద్రప్రభుత్వం, బీజేపీ నేతలు ఎన్ని కుయుక్తులు పన్నినా అన్నదాతలు పోరాటంలో మడమ తిప్పకపోవటంతో చివరకు మోదీ సర్కారే దిగొచ్చి చట్టాలను రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలే ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆ చట్టాలను వెనక్కు తీసుకొన్నది. అయితే, రద్దుచేసి 40 రోజులు తిరుగకముందే మళ్లీ ఆ చట్టాలు తెస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ శుక్రవారం ప్రకటించారు.
నాగపూర్లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన సాగు చట్టాలను రద్దుచేయటం ప్రభుత్వం ఒక వెనుకడుగు వేసినట్టు మాత్రమేనని, ఆ చట్టాలను మళ్లీ తెస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలతో వ్యవసాయరంగంలోకి భారీగా ప్రైవేటు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. మరుసటి రోజే శనివారం ఢిల్లీలో సుపరిపాలన దినోత్సవంలో పాల్గొన్న హోంమంత్రి అమిత్ షా కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘2014కు ముందు అనేక ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి. కానీ, నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు వచ్చింది కేవలం పరిపాలన చేయటానికి మాత్రమే రాలేదని, దేశాన్ని మార్చటానికి వచ్చారని ప్రజలు అర్థమైంది. గత ప్రభుత్వాలు ఓటుబ్యాంకు కోసం నిర్ణయాలు తీసుకొనేవి. మోదీ ప్రభుత్వం మాత్రం ప్రజలకు నచ్చినట్టు కాకుండా, వారికి మంచిచేసేలా నిర్ణయాలు తీసుకొంటున్నది. రాజకీయంగా నష్టం వాటిల్లినా కఠిన నిర్ణయాలే తీసుకుంటుంది’ అని తెలిపారు.
పంజాబ్, యూపీ కోసమేనా?
సాగు చట్టాలను ప్రభుత్వం వైఖరి రైతులు అనుమానించినట్టుగానే ఉన్నది. వాటిని రద్దుచేసి 40 రోజులు తిరుగకముందే మళ్లీ తెస్తామని అమిత్షా, తోమర్ సంకేతాలు ఇవ్వటంతో రైతులు అవాక్కయ్యారు. వచ్చే ఏడాది మొదట్లో బీజేపీకి అత్యంత కీలకమైన పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం పంజాబ్లో కాంగ్రెస్, యూపీలో బీజేపీ అధికారంలో ఉన్నాయి. పంజాబ్ ప్రస్తుత అసెంబ్లీ కాలం వచ్చే మార్చి 27, యూపీ అసెంబ్లీ మే 14తో ముగుస్తాయి. అందువల్ల పంజాబ్ అసెంబ్లీకి వచ్చే ఫిబ్రవరి- మార్చిలో, యూపీకి కూడా దాదాపు అదే సమయంలో ఎన్నికలు నిర్వహిస్తారు. బీజేపీకి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు షాకిచ్చారు. యూపీలో ఎస్పీ, పంజాబ్లో ఆప్ మరింత బలపడ్డాయని సర్వేలు చెప్తున్నాయి. దీంతో తమకు షాక్ తప్పదని కమలనాథులు అంచనాకు వచ్చారు. అందువల్లనే తాత్కాలికంగా నష్టమని తెలిసినా మళ్లీ రైతుల సానుభూతి పొందేందుకు సాగుచట్టాలను రద్దుచేశారనే అభిప్రాయాలున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా, ఓడినా సాగుచట్టాలను తిరిగి తీసుకురావటం ఖాయమని కేంద్ర మంత్రుల ప్రకటనలను బట్టి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ గెలిస్తే మరింత బలప్రయోగంతో చట్టాలను ముందుకు తెస్తుందని చెప్తున్నారు. అయితే, ఈసారి చట్టాలు తెచ్చే క్రమంలో గతంలో చేసిన తప్పులు చేయకపోవచ్చని అంటున్నారు. రైతులకు సుదీర్ఘ ఉద్యమం చేపట్టే అవకాశం ఇవ్వకుండా పక్కా కుయుక్తులు పన్నిన తర్వాతే చట్టాలు తెస్తుందని అంచనా వేస్తున్నారు. రైతుల అసాధారణ పోరాటంతో రైద్దెన చట్టాలను మళ్లీ తెచ్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ శనివారం ఆరోపించారు. కేంద్రం అహంకారాన్ని రైతులు ఒకసారి ఓడించారని, చట్టాలు తెస్తే మళ్లీ ఓడిస్తారని వ్యాఖ్యానించారు.
పక్కా వ్యూహమా?
దేశ వ్యవసాయరంగంలో సంస్కరణల కోసం అంటూ బీజేపీ ప్రభుత్వం గతేడాది వర్షాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టి ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేక మధ్యే ఆమోదింపజేసుకున్నది. ఈ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్చేస్తూ అప్పటి నుంచి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. వీరిలో అత్యధికం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రైతులే ఉన్నారు. ఈ రైతుల ఉద్యమాన్ని మోదీ సర్కారు మొదట్లో తేలికగా తీసుకున్నది. నాలుగురోజులు రోడ్లపై హడావిడి చేసి ఎవరిండ్లకు వారు వెళ్లిపోతారన్న ధోరణిలో ఉన్నది. కానీ రైతులు ఏడాది వరకైనా పోరాడటానికి సిద్ధంగా సరంజామాను సిద్ధంచేసుకొని ఢిల్లీ వెలుపల తిష్టవేయటంతో ప్రభుత్వ పెద్దలు ఖంగుతిన్నారు. ఇప్పుడు బీజేపీకి అత్యంత కీలకమైన పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్తోపాటు గోవా, మణిపూర్ అసెంబ్లీలకు ఎన్నికలు దగ్గరపడటంతో ప్రధాని నరేంద్రమోదీ ఈ చట్టాలను రద్దుచేస్తున్నట్టు నవంబర్ 19న ప్రకటన చేశారు. నిజానికి ఇలాంటి ప్రకటనను ఉద్యమం చేస్తున్న రైతులు కూడా ఊహించలేదు. మోదీ ప్రకటనను చాలామంది స్వాగతించినా రైతు ఉద్యమకారులు పూర్తిగా నమ్మలేదు. అందుకే ఇటీవలి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆ చట్టాలను పూర్తిగా వెనక్కు తీసుకొనేవరకు ఉద్యమం వీడి ఇండ్లకు వెళ్లలేదు.
అది అహంకార ప్రకటన: కిసాన్ ఏక్తా మోర్చా
సాగు చట్టాలను మళ్లీ తీసుకొస్తామన్న కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ వ్యాఖ్యలపై కిసాన్ ఏక్తా మోర్చా శనివారం ట్విట్టర్ వేదికగా మండిపడింది. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధం, అహంకారపూరితమైనవని ధ్వజమెత్తింది. ‘ కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి.. మళ్లీ భారీ ముందడుగు వేద్దామనుకుంటే అది అర్థంలేని ఆలోచనే. మద్దతు ధరతోపాటు అన్ని సమస్యలపై రైతులు, కిసాన్ సంఘటన్ ఒకే తాటిపై ఉన్నాం. కేంద్రం గర్వం అణచేందుకు ఎప్పడూ సిద్ధంగానే ఉంటాం’ అని ట్వీట్ చేసింది.
రైతు సంఘాల రాజకీయ పార్టీ
వివాదాస్పద కొత్త సాగు చట్టాలను రద్దు చేసేలా కేంద్రంలోని మోదీ సర్కార్ మెడలు వంచిన రైతు సంఘాలు ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. ‘సంయుక్త సమాజ్ మోర్చా’ పేరుతో పంజాబ్కు చెందిన 22 రైతు సంఘాలు కొత్త రాజకీయ వేదికను స్థాపించాయి. ఈ మేరకు రైతు సంఘాల నేతలు శనివారం ప్రకటించారు. మోర్చా అధ్యక్షుడిగా బీకేయూ(రాజేవాల్) నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ ఉంటారని తెలిపారు. వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాల్లో పోటీ చేస్తామని బల్బీర్ సింగ్ ప్రకటించారు. కాగా, ఎన్నికల్లో తాము పోటీచేయట్లేదని ఉద్యమానికి నేతృత్వం వహించిన సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది.