(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఎలక్టోరల్ బాండ్ల ద్వారా గత ఐదేండ్లలో రాజకీయ పార్టీలకు రూ.10,792 కోట్ల విరాళాలు లభిస్తే అందులో 75 శాతానికి పైగా విరాళాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే దక్కాయి. అంటే రమారమీ రూ.8 వేల కోట్లకు పైగా విరాళాలు బాండ్ల రూపంలో మోదీ పార్టీకే వచ్చాయన్న మాట. వివిధ కంపెనీలు, వ్యక్తులు ఈ విరాళాలు అందించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజకీయ పార్టీలకందే విరాళాల్లో పారదర్శకత తీసుకురావాలని 2017-18లో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని తీసుకువచ్చారు. ఇప్పటివరకు 22 దఫాలుగా ఈ బాండ్స్ జారీ అయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే ఈ ఎలక్టోరల్ బాండ్స్ జారీ చేసే అధికారం ఉన్నది. అయితే, ఈ పథకం ఆశించిన పారదర్శకత పెంచకపోగా, మరిన్ని అనుమానాలకు తావిస్తున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ పార్టీలు విరాళాలు ఇచ్చిన వారి పేర్లు బయట పెట్టే దాకా విరాళాలకు సంబంధించిన సమాచారం రహస్యంగానే ఉండిపోతున్నది. విరాళాలిస్తున్న వారు బహిరంగంగా తమ పేర్లు చెప్పాల్సిన అవసరం లేకుండా, బాండ్స్ కొని, నేరుగా రాజకీయ పార్టీల ఖాతాల్లో నిధులను జమచేసే అవకాశం ఉంటే, ఇక పారదర్శకతకు అర్థమేమిటని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ వంటి పార్టీలు తమకు విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా ప్రజాసంపదను దోచిపెట్టడం ఇందులో భాగమేనని చెప్తున్నారు. 2018 నుంచి 2020 వరకు బీజేపీకి మిగతా అన్ని పార్టీల కన్నా అత్యధికంగా రూ.4,219 కోట్ల విరాళాలు అందాయి. అంటే ఆ మూడేండ్లలో మొత్తం జారీ అయిన ఎలక్టోరల్ బాండ్స్లో 67.9% వాటా బీజేపీదేనని అర్థమవుతున్నది. ఇక, 2021, 2022లో జారీ చేసిన మొత్తం బాండ్లలో రూ.3,896 కోట్ల విరాళాలు బీజేపీకే లభించాయి.
ఎన్నికల ముందే బాండ్ల ముద్రణ
ఎలక్టోరల్ బాండ్ల విడుదల 2018లో ప్రారంభమైంది. అయితే, సరిగ్గా 2019 ఎన్నికలకు ముందే ఎలక్టోరల్ బాండ్లను ఎస్బీఐ ముద్రించింది. తాజాగా, హిమాచల్, గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆగస్టు 1-అక్టోబర్ 29 మధ్య రూ.10 వేల కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను మళ్లీ ముద్రించింది. ఎన్నికల్లో బీజేపీకి ఆర్థికంగా లబ్ధి చేకూర్చేందుకే అనువైన సమయాల్లో బాండ్లను ఎస్బీఐ ముద్రిస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి.