(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి దేవుళ్లు అంటూ వారి కాళ్లు కడిగిన ప్రధాని మోదీ.. ఆ కార్మికుల సంక్షేమంపై మాత్రం శ్రద్ధ చూపట్లేదు. మురుగు కాల్వలు, సెప్టిక్ ట్యాంకుల్లో పూడికలు తీస్తూ ప్రమాదవశాత్తూ గత ఐదేండ్లలో 400 మందికి పైగా సఫాయి కార్మికులు చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. కానీ, సఫాయి కర్మచారీ ఆందోళన్ జాతీయ కన్వీనర్, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ మాత్రం ఏడాదికి 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 61 మరణాలు సంభవించినట్లు లోక్సభలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే పేర్కొన్నారు.
చట్టాలున్నా.. చర్యలు శూన్యం
చేతులతో డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్ నిషేధానికి కేంద్రం చట్టాలు తీసుకువచ్చింది. వీటి ప్రకారం సఫాయి కార్మికుడికి రూ.10 లక్షల బీమా ఉండాలి. గంట ముందు మ్యాన్హోల్ తీయాలి. ఆక్సిజన్ సిలిండర్, మాస్క్, తదితర పరికరాలు అందుబాటులో ఉంచాలి. కానీ ఇవి అమలు చేయటం లేదు.
ఓడీఎఫ్లో తెలంగాణ నంబర్ వన్
ఓడీఎఫ్ పథకం 100 శాతం అమలు చేసిన రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. పల్లె ప్రగతిలో భాగంగా అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డులు లాంటి పనులను పెద్ద ఎత్తున చేపట్టడంతో ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ఎన్నో అవార్డులు దక్కించుకున్నది.