భైంసా, జూన్ 5 : ప్రజలందరికీ విడుతల వారీగా వ్యాక్సిన్ వేయిస్తామని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని పలువురికి శనివారం టీకా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశానుసారం చిరు వ్యాపారులు, కిరాణాషాపులు, మెడికల్, కూరగాయలు, మటన్, చికెన్, పండ్ల విక్రేతలకు టీకాలు వేస్తున్నారని తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి వెబ్సైట్లో నమోదు చేస్తున్నారని వివరించారు. వారు ఏ తేదీన టీకా వేసుకుంటారో మొబైల్ ఫోన్కు మెసేజ్ వస్తుందన్నారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్, మార్కెట్ కమిటీ చైర్మ న్ కృష్ణ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ ఆసిఫ్, మున్సిపల్ కమిషనర్ ఎంఏ అలీం, హెల్త్ సూపర్ వైజర్ ఖలీం, డాక్టర్ మతీన్, నాయకులు పాల్గొన్నారు.
అందరూ టీకా వేయించుకోవాలి
ఎదులాపురం, జూన్ 5: పట్టణంలోని చిరు వ్యా పారులు, కూరగాయల విక్రేతలు, చికెన్, మటన్, సెలూన్ షాపుల్లో పని చేసే వారందరూ టీకా వేయించుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కోరారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో గార్డెన్లో పుత్లీబౌలి పీహెచ్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపును డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, డీఐవో, అదనపు డీఎంహెచ్వో శ్రీకాంత్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడారు. సూపర్ స్ప్రెడర్ల కోసం ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక క్యాంప్ పది రోజుల పాటు కొనసాగుతుందని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ తెలిపారు. టీకా వేయించుకునే వారు వెంట ఆధార్ కార్డు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, కౌన్సిలర్ ఆకుల ప్రవీణ్, డీఎంవో శ్రీధర్, తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అశోక్, మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్, డీఈవోలు, సీవో పాల్గొన్నారు.