న్యూఢిల్లీ: పశ్చిమ తీర రాష్ట్రమైన కేరళను మరికొన్ని గంటల్లో తొలకరి పలుకరించనుంది. ఈ నెల 3న నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా వేసింది. ఒకవేళ 3న రుతుపవనాల రాక ఆలస్యమైనా 4న కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వాస్తవంగా ఈ నెల 1ననే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయని అంచనా వేసినప్పటికీ.. మందగమనం కారణంగా ఆలస్యమయ్యాయి.
కాగా, ప్రస్తుతం కేరళలో వర్షాలు కురుస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో కురవకపోవడంతో దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ ప్రకటించలేదు. కాగా, రుతుపవనాలు ఈ నెల 3న కేరళలో ప్రవేశించాయంటే అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ ప్రాంతానికి రావడానికి సుమారు వారం రోజుల సమయం పట్టే అవకాశముంది. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉన్నది.