8 ఏండ్లలో పెట్రోల్పై 294% ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన కేంద్రం
డీజిల్పై ఏకంగా 612% పెంపు
క్రూడాయిల్ ధర తగ్గినా ఇంధన ధరలను తగ్గించని మోదీ సర్కారు
కేంద్రం తీరుపై రాష్ర్టాల మండిపాటు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఇంధన ధరలను పెంచేది కేంద్రం అయితే.. పన్నులు తగ్గించాలంటూ ప్రధాని మోదీ రాష్ర్టాలకు కొత్త విజ్ఞప్తులు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పడిపోయినప్పుడు సుంకాల పేరుతో ధరలను వడ్డించి సామాన్యులకు చేరాల్సిన ప్రయోజనాలను ఖజానాకు మళ్లించిన ప్రధాని అసత్య ప్రవచనాలు వల్లించారు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఎన్నికల సమయంలో స్తబ్ధుగా ఉండి.. ఫలితాలు రాగానే పెట్రో ధరలను అమాంతం పెంచేసిన మోదీ.. ఆ నెపాన్ని విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై నెట్టే ప్రయత్నం చేశారు. దేశంలో కరోనా పరిస్థితులపై సమీక్ష పేరిట సీఎంలతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని ఆ భేటీని విపక్షపార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై బురదజల్లే కార్యక్రమంగా మార్చేశారు. అయితే కేంద్రం తీరుపై రాష్ర్టాలు మండిపడుతున్నాయి. ఇంధన ధరలను ఎడాపెడా పెంచేసిన మోదీ సర్కారు.. రాష్ర్టాలు పన్నులు పెంచకున్నా వాటిని ఎలా తగ్గించాలని కోరుతారని విమర్శిస్తున్నాయి.
క్రూడాయిల్ ధర తగ్గినా.. తగ్గించలే
మోదీ తొలిసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పుడు అంటే 2014 మే 26న లీటర్ పెట్రోల్ రూ. 71.41. దీనిపై ఎక్సైజ్ సుంకం రూ. 9.48. అలాగే, డీజిల్ ధర రూ. 55.49గా ఉండగా దీనిపై ఎక్సైజ్ సుంకం రూ. 3.56గా ఉండేది. అప్పుడు బ్యారెల్ చమురు ధర 108 డాలర్లుగా ఉన్నది. కరోనా లాక్డౌన్లో అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోయాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 12 డాలర్లకు దిగివచ్చింది. ఈ లెక్కన దేశంలో పెట్రో ధరలు భారీగా తగ్గాలి. అయితే, వినియోగదారులకు చేరాల్సిన ఆ ప్రయోజనాలను మోదీ సర్కారు ఖజానాకు మళ్లించింది. ఈ క్రమంలోనే పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీని ఏకంగా రూ. 32.90, డీజిల్పై రూ. 31.80కు పెంచింది.
మతలబు ఇదే..
ఐదు రాష్ర్టాల ఎన్నికల నేపథ్యంలో గత నవంబర్లో పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీని రూ.5, డీజిల్పై రూ.10ని కేంద్రం తగ్గించింది. దీంతో ఎక్సైజ్ డ్యూటీ లీటర్కు రూ.27.98, డీజిల్పై రూ. 22.83కు తగ్గింది. ఇందులో పెట్రోల్పై సెస్ లీటర్కు రూ. 20.5 ఉండగా, డీజిల్పై లీటర్కు రూ. 22గా ఉంది. సెస్ను కేంద్రం రాష్ర్టాలతో పంచుకోదు. అందుకే, రాష్ర్టాలతో పంచుకునే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్రం.. రాష్ర్టాలతో పంచుకోని సెస్ను తగ్గించలేదు. దీన్నిచూస్తే కేంద్ర ప్రభుత్వ కుట్రకోణం సులభంగా బయటపడుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇంధన ధరలపై విధించే వ్యాట్ గందరగోళంగా ఉండటంతో 2015, జనవరి 17న తెలంగాణ ప్రభుత్వం దాన్ని హేతుబద్దీకరించింది. లీటర్ పెట్రోల్పై వ్యాట్ను 35.2 శాతంగా, డీజిల్పై 27 శాతంగా నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ వ్యాట్ను సవరించలేదు.