ముంబై: కేంద్రప్రభుత్వం ఇంధన ధరలపై సుంకాలు తగ్గించినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించడంలేదని, సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇకనైనా ఆయా రాష్ట్రాలు పన్నులను తగ్గించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. మోదీ వ్యాఖ్యల పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన మూడేళ్లలో తమ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై సుమారు 1500 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు దీదీ అన్నారు. ప్రధాని మోదీ తప్పుదోవ పట్టించేలా వన్సైడ్గా మాట్లాడినట్లు ఆమె ఆరోపించారు. ప్రధాని వెల్లడించిన అంశాలు అవాస్తవం అన్నారు. పెట్రోల్, డీజిల్పై తమ ప్రభుత్వం మూడేళ్ల నుంచి లీటర్పై ఒక రూపాయి సబ్సిడీ ఇస్తున్నట్లు ఆమె చెప్పారు.
తమ రాష్ట్రానికి కేంద్రం బాకీ ఉందని, సుమారు 97 వేల కోట్లు కేంద్రం నుంచి రావాలని ఆమె అన్నారు. అయితే తమకు రావాల్సిన అమౌంట్లో సగం వచ్చినా.. ఆ మరుసటి రోజే 3000 కోట్ల పెట్రో సబ్సిడీ ఇవ్వనున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. సబ్సిడీతో తనకు సమస్య లేదని, కానీ ప్రభుత్వాన్ని నడపడం ఎలా అని ఆమె ప్రశ్నించారు. సీఎంలతో జరిగిన సమావేశంలో తమకు కౌంటర్ ఇచ్చే అవకాశం రాలేదన్నారు. పెట్రో సబ్సిడీ ఇస్తున్న యూపీ, గుజరాత్ రాష్ట్రాలను మోదీ పొగడడాన్ని ఆమె తప్పుపట్టారు. ఆ రాష్ట్రాలకు కేంద్రం మంచి ఆర్థిక సహకారం అందుతోందన్నారు. రాష్ట్రాలను తప్పుపట్టడం చాలా నీచమైన ఎజెండా అని తృణమూల్ పార్టీ విమర్శించింది. ప్రజాస్వామ్యాన్ని బుల్డోజ్ చేయవద్దు అని ఆ పార్టీ తన ట్వీట్లో పేర్కొన్నది.