గడిచిన 17 ఏండ్లలో ఏకంగా 15 సార్లు రూ. వెయ్యి కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన సంస్థ అది. కంపెనీ పనితీరుకు మెచ్చి పుష్కర కాలం కిందటే ప్రభుత్వం నవరత్న హోదా ఇచ్చింది. విదేశీ సంస్థలు కూడా ఏటా కోట్ల డాలర్ల ఆర్డర్లను కట్టబెడుతున్నాయి. అలాంటి లాభదాయక కంపెనీని మోదీ సర్కారు ప్రైవేటుపరం చేయడానికి సిద్ధమైంది. బీజేపీ సర్కారు కబంద హస్తాల్లో చిక్కుకొన్న ఆ కంపెనీ ‘షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ)’.
వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ పేరిట కేంద్రప్రభుత్వం ఎస్సీఐను ప్రైవేట్పరం చేయడానికి సిద్ధమైంది. 2020 నవంబర్లోనే ఎస్సీఐ విక్రయ ప్రక్రియకు మొదలుపెట్టిన కేంద్రం కరోనా సంక్షోభంతో ఆ పనులను తాత్కాలికంగా నిలిపేసింది. తాజాగా తొలివిడతలో కంపెనీలోని నాన్-కోర్ అసెట్స్ను (సంస్థ కార్యకలాపాలతో సంబంధంలేని ఆస్తులు, యంత్రాలు) విక్రయించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మరో మూడు, నాలుగు నెలల్లోగా ప్రైవేట్ కంపెనీల నుంచి బిడ్లను ఆహ్వానించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎస్సీఐ నాన్-కోర్ అసెట్స్ విలువ రూ. 2,392 కోట్లు.
రెండు విడుతల్లో విక్రయం
ప్రభుత్వ కంపెనీలను తెగనమ్మి 2022-23 ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.65 వేల కోట్లను సమీకరించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే రూ.3 వేల కోట్లకు ఓఎన్జీసీని (మైనారిటీ వాటా), రూ.21 వేల కోట్లకు ఎల్ఐసీని (ఐపీవో), రూ.211 కోట్లకు పవన్హన్స్ (51శాతం వాటా) సంస్థలను విక్రయానికి పెట్టింది. తాజాగా ఎస్సీఐను కూడా విక్రయించడానికి సిద్ధమైంది. ఎస్సీఐలోని మెజారిటీ వాటా 63.75 శాతాన్ని ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించిన కేంద్రం.. రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలనుకొంటున్నది. తొలిదశలో సంస్థ వద్ద ఉన్న నాన్-కోర్ అసెట్స్ను విక్రయించడం. దీనికోసం సెప్టెంబర్లోగా బిడ్లను ఆహ్వానించనున్నారు. రెండోదశలో కంపెనీ నిర్వహిస్తున్న షిప్పింగ్ బిజినెస్ను విక్రయించనున్నారు.
రంగంలోకి ‘మహా’ సర్కారు?!
తొలిదశలో భాగంగా కేంద్రం విక్రయించనున్న నాన్-కోర్ అసెట్స్లో ముంబైలోని షిప్పింగ్ హౌజ్ (ఎస్సీఐ కార్పొరేట్ హెడ్క్వార్టర్స్), పొవాయిలోని 44 ఎకరాల ఎంటీఐ (మారిటైమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్)ను కూడా చేర్చారు. ఎస్సీఐ కార్యకలాపాల కోసమే మహారాష్ట్ర సర్కారు షిప్పింగ్ హౌజ్ కోసం భూమిని కేటాయించింది. సీఎం, రాష్ట్ర మంత్రుల కార్యాలయాలు ఉన్న మడామే కామా రోడ్డులో సెక్యూరిటీ వలయంలో ఈ ఆఫీసు ఉన్నది. ఇప్పుడు ప్రైవేటీకరణ పేరిట కేంద్రం షిప్పింగ్ హౌజ్ను ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగిస్తే మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరపెట్టవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రప్రభుత్వానికి చెందిన భూమిలో, అత్యంత భద్రత నడుమ ఉన్న భవనాన్ని ప్రైవేటు కంపెనీలకు ఎలా విక్రయిస్తారని ప్రశ్నించవచ్చని పేర్కొన్నాయి.