ఇది కేంద్రం దెబ్బ..
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆహారం, ఎరువుల సబ్సిడీ వ్యయాన్ని రూ.3.7 లక్షల కోట్లకు కుదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. రూ.2.7 లక్షల కోట్లుగా ఉన్న ఆహార సబ్సిడీని రూ.2.3 లక్షల కోట్లకు, ఎరువుల సబ్సిడీని రూ.2.3 లక్షల కోట్ల నుంచి రూ.1.4 లక్షల కోట్లకు కుదించాలని భావిస్తున్నది.
న్యూఢిల్లీ, జనవరి 3: కాకులను కొట్టి గద్దలకు వేస్తున్నట్టుగా కార్పొరేట్లకు అప్పనంగా రూ.లక్షల కోట్ల రాయితీలను కట్టబెడుతున్న నరేంద్రమోదీ ప్రభుత్వం.. ఎప్పటి మాదిరిగానే సామాన్య ప్రజలు, రైతుల నోట్లో మళ్లీ మట్టి కొట్టబోతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఆహారం, ఎరువుల సబ్సిడీ వ్యయాన్ని రూ.3.7 లక్షల కోట్లకు కుదించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కొవిడ్ సంక్షోభ సమయంలో భారీగా పెరిగిన ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్య చేపట్టబోతున్నదని, దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోలిస్తే ఆహారం, ఎరువుల సబ్సిడీలు 26% తగ్గనున్నాయని ఇద్దరు ప్రభుత్వాధికారులు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ మొత్తం బడ్జెట్ వ్యయం రూ.39.45 లక్షల కోట్లుగా ఉన్నది.
ఇందులో ఎనిమిదింట ఒక వంతు మొత్తాన్ని ఆహార, ఎరువుల సబ్సిడీలకు కేటాయించారు. లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సబ్సిడీలను తగ్గించడం రాజకీయంగా సున్నితమైన వ్యవహారమే. అయినా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.7 లక్షల కోట్లుగా ఉన్న ఆహార సబ్సిడీని రూ.2.3 లక్షల కోట్లకు, ఎరువుల సబ్సిడీని రూ.2.3 లక్షల కోట్ల నుంచి రూ.1.4 లక్షల కోట్లకు కుదించాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్టు అధికారులు వివరించారు. దీనిపై స్పందించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ నిరాకరించింది. ఆహార, ఎరువుల మంత్రిత్వ శాఖలు కూడా నోరు మెదపడం లేదు. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో పేదల కోసం ప్రవేశపెట్టిన ఉచిత రేషన్ పథకానికి మంగళం పాడటం, దాని స్థానంలో తక్కువ ఖర్చుతో కూడిన పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో నిధులను పొదుపు చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నదని, దీంతో పేదలకు అందే ఉచిత రేషన్ ఈ ఏడాది నుంచే సగానికి సగం తగ్గడం ఖాయమని ఆ అధికారులు స్పష్టం చేశారు.
ద్రవ్యలోటు కట్టడికి ఆపసోపాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6.4 శాతం మించకుండా చూసుకోవాలని నిశ్చయించుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఆపసోపాలు పడుతున్నది. అయినా ఇది గత దశాబ్ద కాలంలో 4 నుంచి 4.5 శాతంగా ఉన్న సగటు ద్రవ్యలోటు కంటే చాలా ఎక్కువే. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు నిష్పత్తిని కనీసం అర పర్సెంటేజ్ పాయింట్ అయినా తగ్గించుకోవాలని కేంద్రం యోచిస్తున్నదని, అందుకే ఆహారం, ఎరువుల సబ్సిడీల ఖర్చును భారీగా కుదించుకోవాలని చూస్తున్నదని అధికారులు వివరించారు.