CAG | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 16, (నమస్తే తెలంగాణ): కేంద్ర నిధుల విడుదలలో బీజేపీయేతర రాష్ట్రాలను సతాయిస్తున్న మోదీ సర్కార్, బీజేపీ పాలిత రాష్ర్టాలకు మాత్రం అడ్డగోలుగా దోచిపెడుతున్నది. ఇందుకు తాజా ఉదాహారణ.. గుజరాత్లో విడుదలైన కాగ్ నివేదిక. ఇతర పద్దుల పేరిట అనామక ఖాతాల్లోకి నిధులు దారిమళ్లిన సంగతి కాగ్ బయటపెట్టింది. స్థానిక సంస్థలకు గ్రాంట్ల రూపంలో ఇచ్చిన నిధులను ఇతర పద్దుగా చూపెట్టి ఈ నిధులను మళ్లించారని తెలిపింది.
రూ.లక్షా 18 వేల కోట్ల నిధులు గల్లంతయ్యాయి. పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలు, మూలధన ఆస్తుల సృష్టికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఇతరాలు’ పద్దు పేరిట నిధులు విడుదల చేసింది. 2021-22లో రూ.24,764 కోట్లు పంపిణీ చేసింది. 2017 నుంచి 2022 వరకు ఐదేండ్లపాటు నిధుల వ్యయం వివరాలు కానీ, యుటిలైజేషన్ సర్టిఫికెట్ కానీ లేదని కాగ్ తెలిపింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వచ్చిన నిధుల వినియోగంపై ప్రతి సంవత్సరం సంబంధిత విభాగానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని, ఆ సర్టిఫికెట్ ఇవ్వకుండా కేంద్రం తన గ్రాంట్లను ఏ విధంగా విడుదల చేసిందని ప్రశ్నించింది.