న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశవ్యాప్తంగా మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే 2024లో కూడా తానే ప్రధాని అవుతానంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వందేండ్లు అయ్యే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని, ఆ కలను సాకారం చేసుకొనే దిశగా దేశం ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. రానున్న ఐదేండ్లలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అన్నారు. భారత్ ‘విశ్వ మిత్ర’గా మారిందని పేర్కొన్నారు. అవినీతి, వారసత్వ రాజకీయాలు దేశాన్ని నాశనం చేశాయని, వీటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు.
మణిపూర్ హింసాకాండ, మహిళలపై లైంగిక దాడుల ఘటనలపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు నెమ్మదిగా మెరుగవుతున్నాయని పేర్కొన్నారు. శాంతి ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. యావత్తు దేశం మణిపూర్కు అండగా ఉన్నదని పేర్కొన్నారు.
దేశంలో ఆందోళనకరస్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని స్పందించారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి, ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. .
ప్రజల ఆశీర్వాదం ఉంటే 2024 లోక్సభ ఎన్నికల్లో తామే గెలుస్తామని, వచ్చే ఏడాది కూడా ఎర్రకోట నుంచి ప్రధానిగా తానే ప్రసంగిస్తానని, దేశం సాధించిన పురోగతిని చాటిచెప్తానని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మార్పు కోసం ఇచ్చిన హామీ తనను మొదటి సారి గెలిపించిందని, తన పనితీరు రెండోసారి విజయం తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. కాగా, ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకాలేదు.
ఈ ఏడాది పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని పలు కొత్త పథకాలను ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో దిగువ, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టు తెలిపారు. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చేలా ఈ పథకం ఉంటుందని చెప్పారు. ఓబీసీ కమ్యూనిటీలను దృష్టిలో ఉంచుకొని, విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రకటించారు. సంప్రదాయ కళాకారుల జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు తొలి విడతగా రూ.13 వేల – రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. జన ఔషధి కేంద్రాలను 10 వేల నుంచి 25 వేలకు పెంచుతామని పేర్కొన్నారు. మహిళా స్వయం ఉపాధి సంఘాలకు అగ్రి డ్రోన్లను అందజేస్తామన్నారు. రెండు కోట్ల మంది మహిళలు లక్షాధికారులుగా మారడం చూడాలనేది తన కల అని, ఇందు కోసం చిన్న పరిశ్రమలు స్థాపించేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మోదీ పేర్కొన్నారు.